నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్
ఫ్లోరిడా (అమెరికా): భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్రకు బయల్దేరారు. యాక్సియం-4 మిషన్లో భాగంగా మొత్తం నలుగురు వ్యోమగా ములు కలిసి అంతరిక్ష యాత్రను చేపట్టారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం బుధవారం 12:01 గంటలకు ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 41 ఏళ్ల తర్వాత రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టనున్న రెండో భారతీయుడిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరనున్న తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డుల కెక్కనున్నారు. భూమి నుంచి బయల్దేరిన ఫాల్కన్-9 రాకెట్ 28గంటల తర్వాత గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం-ఐఎస్ఎస్తో అనుసంధానం కానుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష సంస్థలు భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఇక శుభాంశు మిషన్ పైలట్గా బాధ్యతలు నిర్వహి స్తారు. ఈ మిషన్కు నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ కమాండర్గా వ్యవహరిస్తున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన పోలాండ్, హంగేరీకి చెందిన వ్యోమగాములు స్లావోజ్, టిబోర్ కాపు మిషన్ స్పెషలిస్టుగా వ్యవహరిస్తారు. యాక్సియం-4 మిషన్ ప్రయోగం మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ వేర్వేరు కారణాల వల్ల అనేకసార్లు వాయిదా పడిన సంగతి విదితమే.
భారతీయులంతా ఈ ప్రయాణంలో భాగమే…
వ్యోమనౌకలోకి వెళ్లడానికి ముందు శుభాంశు తనకు ఎంతో ఇష్టమైన ‘ఫైటర్’ సినిమాలోని ‘వందేమాతరం’ అనే పాటను విన్నారు. ప్రయోగం అనంతరం ఫాల్కన్ 9 రాకెట్లోని వ్యోమనౌక నుంచి మాట్లాడారు. ‘‘నా ప్రియమైన దేశ ప్రజలకు నమస్కారం. 41 సంవత్సరాల తర్వాత మనం తిరిగి అంతరిక్షంలోకి వచ్చాం. ఇది అద్భుతమైన ప్రయాణం. సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతున్నాం. నా ప్రయాణం ఐఎస్ఎస్కి వెళ్లడానికి కాదు, భారత్ చేపడుతున్న మానవ అంతరిక్ష కార్యక్రమానికి పునాది. మీరందరూ ఈ ప్రయాణంలో భాగం కావాలని నేను కోరుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా గర్వంతో ఉప్పొంగాలి. భారతదేశ మానవ అంతరిక్ష కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. జై హింద్! జై భారత్!’’ అని పేర్కొన్నారు.
రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
శుభాంశు శుక్లా రోదసి యాత్ర విజయవంతమ వడంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుభాంశు శుక్లాకు శుభాకాంక్షలు తెలిపారు. శుభాంశు బృందం సరికొత్త చరిత్రను సృష్టించిందని, భారత అంతరిక్ష చరిత్రలో ఇదో కొత్త మైలురాయి అని రాష్ట్రపతి అన్నారు. ఈ యాత్రపై దేశం మొత్తం గర్వపడుతోందని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఐఎస్ఎస్కు వెళ్లే తొలి భారతీయుడు శుభాంశు కానున్నారని మోదీ అన్నారు. 1.4 బిలియన్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను తనతో తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. శుభాంశు బృందం విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు ఎక్స్లో పేర్కొన్నారు.
తల్లిదండ్రుల ఆనందం…
ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగానే భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. ఉత్తర్ప్రదేశ్లోని లక్నోలో యాక్సియం-4 మిషన్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన శుభాంశు శుక్లా కుటుంబ సభ్యులు ఫాల్క్న్-9 రాకెట్ అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగా పయనమవ్వటంతో ఆనందంతో గంతులు వేశారు. తమ కుమారుడు అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లుతుండటం ఆనందంగా ఉందని శుభాంశు శుక్లా తండ్రి శంభు దయాల్ శుక్లా తెలిపారు.