విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ‘రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కలు పుల్… ఖజానా నిల్గా ఉంది. ఇది ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసిన ఓ పెద్ద ప్రయత్నం’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. ఆర్థికశాఖమంర్రతి పయ్యావుల కేశవ్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్పై రామకృష్ణ ఓ ప్రకటనలో స్పందించారు. మొత్తం రూ.3,22,359 కోట్ల భారీ బడ్జెట్ను ప్రతిపాదించారని, ఇందులో రెవెన్యూలోటు 33,185 కోట్లు, ద్రవ్యలోటు రూ.79,926 కోట్లుగా చూపించారని, ఇంత లోటును ఎలా భర్తీ చేస్తారని రామకృష్ణ ప్రశ్నించారు. అప్పులు చేస్తారా? ఆస్తులు అమ్ముతారా? లేక ప్రజలపై భారం మోపుతారా అని నిలదీశారు. జగన్ ప్రభుత్వ హయాంలో రూ.4,21,201 కోట్లు అప్పుచేసినట్లు గత బడ్జెట్లో చెప్పారని, ఇప్పుడు మీరు రూ.7 లక్షల కోట్లకుపైగా అప్పులు చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయ రంగానికి, నీటిపారుదల రంగానికి ప్రాధాన్యతే ఇవ్వలేదన్నారు. సాగునీటి రంగానికి కనీసం 10 శాతం కేటాయింపులు ఉండాలని, అంటే లెక్క ప్రకారం రూ.32 వేల కోట్లు కేటాయించాలని, అయితే సాగునీటికి కేటాయించింది కేవలం రూ.11,314 కోట్లు మాత్రమేనని, అది 3.5 శాతం కూడా లేదని పేర్కొన్నారు. పోలవరం కాకుండా రాష్ట్రంలో సాగునీటికి రూ.77,845 కోట్లు కావాలని, ఒక్క రాయలసీమకే రూ.40,480 కోట్లు అవసరమని, ఈ అరకొర కేటాయింపులతో కచ్చితంగా రాయలసీమకు అన్యాయం జరుగుతుందన్నారు. ధరల స్థిరీకరణకు రూ.4,500 కోట్లు అవసరమని, కానీ రూ.300 కోట్లే కేటాయించారన్నారు. గిట్టుబాటుధరల్లేక రైతులు అల్లాడుతుంటే… ఈ నిధులు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవకు రూ.10,400 కోట్లు అవసరం కాగా రూ.6,300 కోట్లు మాత్రమే కేటాయించారని పేర్కొన్నారు. కౌలు రైతులను పూర్తిగా విస్మరించారని, మహిళలకు ఉచిత బస్సును అటకెక్కించారన్నారు. ప్రతినెలా మహిళకు ఇస్తామన్న రూ.1500, నిరుద్యోగ భృతి రూ.3 వేలు అంశాలను బడ్జెట్లో కనీసం ప్రస్తావించలేదన్నారు. బీసీలకు 50 ఏళ్లు దాటితే పెన్షన్, చంద్రన్న బీమా పథకాలనూ పక్కనపెట్టేశారన్నారు. ఆటో, టాక్సీ, లారీ డ్రైవర్లకు ఏటా రూ.15 వేలు ఇస్తామని హామీని తుంగలో తొక్కారన్నారు. న్యాయవాదులకు నెలకు రూ.10 వేలు, కాపు సంక్షేమానికి రూ.15 వేల కోట్లు, పెళ్లికానుక కింద లక్ష రూపాయలు ఇస్తామని డాంబికాలు పలికి… వాటిని పూర్తిగా మర్చిపోయారని తెలిపారు. తల్లికి వందనం, దీపం పథకాల్లోనూ భారీ కోత విధించారన్నారు. తల్లికి వందనానికి రూ.25 వేల కోట్లు అవసరం కాగా… కేవలం రూ.9,400 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. కోటీ 55 లక్షల మంది దీపం లబ్ధిదారులను 90 లక్షలకు కుదించడమేగాక… బడ్జెట్లో రూ.4 వేల కోట్లను రూ.2,601 కోట్లకు తగ్గించేశారని వివరించారు. డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకూ సున్నా వడ్డీకి రుణమిస్తామని ప్రకటించిన కూటమి పార్టీలు… ఈ బడ్జెట్లో దానిపై ఒక్క మాటా చెప్పలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ ఈ బడ్జెట్లో కానరాలేదని, ఇక ఎన్నికల వాగ్దానాలను పూర్తిగా విస్మరించినట్లేనా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వ పాలనలో ఏపీ చరిత్రలోనే రికార్డుస్థాయి అప్పులకు రంగం సిద్ధమైందని బడ్జెట్ స్పష్టం చేస్తోందన్నారు. గాలి బడ్జెట్ను గొప్ప బడ్జెట్గా కీర్తిస్తున్న కూటమి నేతలు ఊహల నుంచి వాస్తవాల్లోకి రావాలని, పైగా దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన మోదీని పదేపదే కీర్తించడం విడ్డూరంగా ఉందని రామకృష్ణ తెలిపారు.