Thursday, June 5, 2025
Homeఆంధ్రప్రదేశ్వాగ్దానాల అమలు ఇంకెప్పుడు?

వాగ్దానాల అమలు ఇంకెప్పుడు?

ఇకనైనా స్పందించకుంటే ఉద్యమం ఉధృతం

. ప్రభుత్వానికి రామకృష్ణ హెచ్చరిక
. గూడు కోసం రోడ్డెక్కిన పేదలు

విశాలాంధ్ర – విజయవాడ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ నిరుపేదలు రోడ్డెక్కారు. గూడు లేక నానా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవ డంపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ… రాష్ల్ర వ్యాప్తంగా సీపీఐ అధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పేదల ఇళ్ల స్థలాల సాధనకై సీపీఐ ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం విజయవాడ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పెద్దఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టి… ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సీపీఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎర్ర జెండాలు, ప్లకార్డులు చేత పట్టుకుని ఇళ్ల స్థలాలు ఇవ్వాలి… ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు కేటాయించాలి… సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయాలి… టిడ్కో ఇళ్లు వెంటనే కేటాయించాలి అంటూ పేదలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ప్రజలను మాట్లాడుతూ… ఎన్నిక సమయంలో ఓట్ల కోసం ఇష్టారీతిగా హామీలు ఇవ్వడం… అధికారం దక్కిన తర్వాత వాటిని గాలికోదిలేసి మోసం చేయడం సరికాదన్నారు. అధికారంలో లేనప్పుడు ఒకమాట అధికారంలోకి వచ్చిన తరువాత మరొకమాట మాట్లాడటం టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. అధికారం చేపట్టి ఏడాదైనా సూపర్‌ సిక్స్‌ వాగ్దానాలు ఎందుకు అమలు చేయడంలేదని నిలదీశారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇష్టరీతిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఎన్నో వాగ్దానాలు చేశారని…ప్రధానంగా ఇళ్ల స్థలాలు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3సెంట్లు , ఇంటి నిర్మాణం కోసం రూ.4లక్షల ఇస్తామని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క స్థలమైన కేటాయించారా అని ప్రశ్నించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గత నాలుగు నెలలుగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా కూడా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు. కోట్లాది రూపాయిలతో నిర్మించిన టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడం దుర్మార్గమన్నారు. కేవలం విజయవాడ పరిధిలో దాదాపుగా 6,800 టిడ్కో ఇళ్లు ఉన్నాయని గత 10ఏళ్లుగా లబ్ధిదారులకు ఇవ్వకుండా వదిలేశారన్నారు. కేంద్ర ం ఇచ్చే ఇంటి నిర్మాణ సాయాన్ని పెంచమని ఇటీవల రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రిని అడిగితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు రావడంలేదని చెబుతున్న పరిస్థితి ఉందన్నారు. గతంలో సీఎం జగన్‌కు ఇళ్ల స్థలాల అంశంలో పేదలకు నివాసయోగ్యంగా ఉండే విధంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వమని సూచించినప్పటికీ ఆయన తమ మాట వినకుండా ఎందుకు పనికి ప్రదేశాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించారని… అవి నివాస యోగ్యంగా లేవన్నారు. తల్లికి వందనం పేరిట ఎంతమంది పిల్లలున్నా రూ.15వేలు అందరికీ ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం విస్మరించిందన్నారు. విద్యా సంవత్సరం పూర్తయినా కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. రూ.15వేలు కాదు కేవలం ఒక విద్యార్థికి రూ.5 వేలు చొప్పున ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వ అధికారులు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ప్రతి మహిళకు రూ. 1500, యువతకు నిరుద్యోగ భృతి రూ.3వేలు, రైతన్నకు రూ. 25వేలు ఇస్తామన్న హామీలు ఏమైపోయాయని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో డీఎస్సీపై తొలి సంతకం చేసి…మరుగన పడేసి సంవతర్సం తరువాత 16వేలు టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు మేరకు అమలు చేయకపోతే ఇది అరంభం మాత్రమేనని రాబోయే రోజుల్లో వామపక్షాలతో పాటు తమతో కలిసొచ్చే ఇతర పార్టీలను కలుపుకుని పెద్దఎత్తున రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. సీపీఐ ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్‌ మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల కోసం పేదల వద్ద వేలాది రూపాయిలు కట్టించుకని ఇప్పటి వరకు ఇళ్లు పంపిణీ చేయకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఓట్లు వేసినా వేయకపోయినా మండుటెండల్లో ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం కమ్యూనిస్టు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. నగరంలోని పశ్చిమ నియోగజకవర్గంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే సుజనా చౌదరి గాలికొదిలేశారని… విదేశాల్లో పర్యటనలు చేస్తున్నారని పేర్కొన్నారు. కేవలం టూరిస్టు ఎమ్మెల్యేగా మారిపోరాయరన్నారు. సమస్యలపై ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను సమస్యలు పరిష్కారానికి చొక్కాపట్టుకుని నిలదీయాలని పిలుపునిచ్చారు. పేదల ఇళ్ల స్థలాలు, ఎన్నికల హామీల అమలుకోసం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని ప్రకటించారు. అవసరమైతే జైళ్లకు వెళ్లడానికైనా సిద్ధమేనన్నారు. పార్టీ నగర కార్యదర్శి జీ కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్‌ ఇచ్చిన హామీలు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు అమలు చేయాలని గతంలో కలెక్టర్‌కు పెద్దఎత్తున అర్జీలు సమర్పించడం జరిగిందని ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేకపోడం దుర్మార్గమన్నారు. అనంతరం ప్రజల వద్ద సేకరించిన అర్జీలను రామకృష్ణ ఆధ్వర్యంలో మండల తహసీల్దారుకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర సహాయ కార్యదర్శులు లంకా దుర్గారావు, నక్కా వీరభద్రరావు, బుట్టి రాయప్ప, మూలి సాంబశివరావు, కేవీ భాస్కరరావు, తాడి పైడియ్య, పంచదార్ల దుర్గాంబ, కొట్టు రమణరావు, అప్పరబోతు రాము, నగర పార్టీ నాయకులు, ఇళ్లులేని నిరుపేదలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు