Wednesday, June 25, 2025
Homeసాంకేతిక పరిజ్ఞానం అవశ్యం

సాంకేతిక పరిజ్ఞానం అవశ్యం

. నకిలీ వార్తలతో జరభద్రం
. పాత్రికేయులకు పత్రికా రంగ ప్రముఖుల సూచనలు
. ఒంగోలులో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు ప్రారంభం

విశాలాంధ్ర – ఒంగోలు : నిత్యం మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని, నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉండాలని పాత్రికేయులకు పత్రికారంగ ప్రముఖులు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ (ఏపీయూడబ్ల్యుజే) 36వ రాష్ట్ర మహాసభలు మంగళవారం ఒంగోలులో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సామాజిక మాధ్యమాలు వాస్తవాల నిర్ధారణ అనే అంశంపై ఎన్టీఆర్‌ కళా పరిషత్‌లో ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు అధ్యక్షత సెమినార్‌ నిర్వహించారు. ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ (ఐజేయూ) అధ్యక్షుడు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివాస రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీఆర్‌ మీడియా అకాడమీ చైర్మన్‌ అలపాటి సురేష్‌ కుమార్‌ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల ద్వారా నకిలీ వార్తల వ్యాప్తి
చెందుతున్నదని, దీనిపై ప్రతి పాత్రికేయుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఏఐ టెక్నాలజీ అన్ని రంగాలలో ప్రవేశిస్తున్నదని, దీనిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఏఐ వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉండేలా కృషిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఏఐ సాంకేతిక గురించి, పత్రికా రంగంలో వినయోగం, ఉపయోగాలపై ఎం.నరసింహ స్వామి మాట్లాడారు. ఒక ఫోటో, వీడియో లేదా వార్త నిజమైనదా కాదా ఎలా తెలుసుకోవచ్చో కూలంకుషంగా వివరించారు. ఏఐతో సమయం ఆదా అవుతుందన్నారు. వార్తల సేకరణ, పంపిణీలోను ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని చెప్పారు. విశాలాంధ్ర ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ కె.అజయ్‌ బాబు మాట్లాడుతూ ప్రపంచం మొత్తం మీద సుమారు 22 కోట్ల యూట్యూబ్‌ ఛానల్స్‌ ఉండగా మన దేశంలో వీటి సంఖ్య ఎంతో ఎక్కువగా ఉందన్నారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ఎక్స్‌ వంటి సామాజిక మాధ్యమాలలో ఫేక్‌ న్యూస్‌ విశృంఖలంగా వస్తున్నాయని, పాత్రికేయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐవీ సుబ్బారావు మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే యూనియన్‌ రాష్ట్ర మహాసభలు ఒంగోలులో నిర్వహించటం ఆనందంగా ఉందన్నారు. కృత్రిమ మేధపై సెమినార్‌ పాత్రికేయులకు ఎంతో ఉపయోగమన్నారు. ఐజేయూ ప్రధాన కార్యదర్శి బల్వీందర్‌ సింగ్‌, స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు ఎస్‌వీ సిన్హా, జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్‌, ఏపీయుడబ్ల్యుజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్‌ ప్రసంగించారు.
ఏపీయుడబ్ల్యుజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎ.సురేష్‌, ప్రకాశం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌వీ రమణ, దాసరి కనకయ్య, ఏపీ ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకట్రావు, ఇఫ్తేకార్‌ బాషా తదితరులు కార్యక్రమం నిర్వహణలో సహకరించారు. సెమినార్‌లో వివిధ జిల్లాల నుంచి 250 మంది పాత్రికేయులు పాల్గొన్నారు. ఒంగోలు దక్షిణ బైపాస్‌లోని విష్ణుప్రియ కన్వెన్షన్‌లో యూనియన్‌ మహాసభ బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి జరుగుతుందని యూనియన్‌ ప్రతినిధులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు