. అక్టోబరు 2 నుంచి అమలు
. సర్క్యులర్ ఎకానమీపై నూతన పాలసీ
. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో పార్కులు
. 15 శాతం వృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు
. ముఖ్యమంత్రి చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో వ్యర్ధాల నిర్వహణ వ్యవస్థను పటిష్టపరిచేలా… రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీ తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మొదటగా రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కులను ఏడాదిలోగా ఏర్పాటు చేయాలని, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో ఆధునిక యంత్రాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలిగించాలని సీఎం ఆదేశించారు. 90 రోజుల్లోగా రీసైక్లింగ్, చెత్తను వేరు చేయడంపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలన్నారు. సచివాలయంలో సర్క్యులర్ ఎకానమీపై అధికారులతో ముఖ్యమంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. వ్యర్ధాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్వినియోగంపై ప్రధానంగా చర్చించారు. ‘సర్క్యులర్ ఎకానమీ పార్కులు’ ఏర్పాటుపై ‘మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ ప్రతిపాదనలను పరిశీలించారు. మొదటిదశలో భాగంగా విశాఖపట్నంలో 400 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ‘సర్క్యులర్ ఎకానమీ పార్కు’ను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని, ఇందుకోసం వివిధ దేశాల్లోని పార్కులు పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. వీటితో భారీగా పెట్టుబడులు వచ్చేలా చూడాలని చెప్పారు. సర్క్యులర్ ఎకానమీ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన వాహనాలు, లిథియం బ్యాటరీలు, జిప్సం, టైర్లు, రబ్బర్, ఎలక్ట్రానిక్, వ్యవసాయం, పారిశ్రామిక, ఆక్వా వ్యర్ధాలు వంటి 11 రంగాలపై దృష్టి పెట్టడంతో పాటు అదనంగా గనులు, చేనేత, పశుసంవర్ధక శాఖలతో కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. వ్యర్ధాల నిర్వహణలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వాళ్లకు ప్రోత్సాహకంగా ‘స్వచ్ఛత’ అవార్డులను వచ్చేఏడాది అక్టోబర్ 2 నుంచి ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో సర్క్యులర్ ఎకానమీ సమర్ధంగా అమలు చేయగలిగితే జీఎస్డీపీకి ఏడాదికి అదనంగా రూ.15 వేల కోట్లు అదనంగా చేరుతుందని అంచనా. మరో రూ.10 వేల కోట్ల విలువైన మెటీరియల్ను ఉత్పత్తి రంగానికి సరఫరా చేసే అవకాశం ఉంటుందని, ఈ విలువ జోడిరపుతో రాష్ట్రం జీఎస్టీ రూపంలో రూ.3 వేల కోట్లు ప్రతీ ఏడాది ఆర్జించవచ్చునని అధికారులు సీఎంకు వివరించారు.
ప్లాస్టిక్ రహిత నగరాలు
ఈ ఏడాది అక్టోబర్ 2 కల్లా రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి నగరాలతో పాటు మరో 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా అరికట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ నగరాల్లో క్లాత్ బ్యాగులు వినియోగాన్ని పెంచాలని చెప్పారు. 87 పట్ణణ ప్రాంతాల్లో 157 రెడ్యూస్-రీయూజ్-రీసైకిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. జిల్లాకు రెండు చొప్పున రాష్ట్రంలోని పట్టణాలు, పంచాయతీ ప్రాంతాల్లో మొత్తం 52 వేస్ట్ క్లస్టర్లు ఏర్పాటు చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రం నుంచి ప్రతీ ఏటా బ్యాటరీలు, ఇతర ఆటోమోటివ్ వ్యర్ధాలు 36,588 టన్నులు, ప్లాస్టిక్ – పెట్ బాటిల్స్ వేస్ట్ 61,996 టన్నులు, ఇంజిన్ ఆయిల్స్ ఇతర హైడ్రాలిక్ చమురు వ్యర్ధాలు 23,928 లీటర్లు, టైర్లు-రబ్బర్ 59,654 మెట్రిక్ టన్నుల వ్యర్ధాలు వస్తున్నాయని ముఖ్యమంత్రికి తెలిపారు. అత్యధికంగా వ్యవసాయరంగం నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్ధాలు, పశవులు-ఆక్వా-పౌల్ట్రీ రంగాల నుంచి 347 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్ధాలు వస్తున్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ రోజూ 88 లక్షల గృహాల నుంచి 1,329 మెట్రిక్ టన్నుల వ్యర్ధాలు వస్తున్నాయని తెలిపారు. రాజస్థాన్, కర్నాటక, మహారాష్ట్రలో సర్క్యులర్ ఎకానమీ కోసం అందిస్తున్న ప్రోత్సాహకాల వివరాలను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
15 శాతం వృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు
15 శాతం వృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించడంతో పాటు పనితీరును మెరుగుపరుచుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏపీ ఎకానమీ, గ్రోత్ డ్రైవర్స్, జీఎస్డీపీ ప్రొజెక్షన్స్, కీ పెర్ఫామెన్స్ ఇండికేటర్లపై సీఎం సమీక్షించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జాతీయస్థాయికి మించి ఏపీ తలసరి ఆదాయం పెరిగిందని అధికారులు వివరించారు. 2024-25కు జాతీయస్థాయిలో సరాసరి తలసరి ఆదాయం 8.7 శాతంగా ఉంటే… ఏపీ 11.89 శాతం నమోదు చేసిందని తెలిపారు.
తలసరి ఆదాయం, జీఎస్డీపీ, రాష్ట్ర ఆదాయాలు ఎలా పెరుగుతాయనే అంశంపై అంచనాలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించాలంటే ఏం చేయాలనే దానిపై డేటా అనలిటిక్స్ చేయాలని సూచించారు. సేవల రంగం అభివృద్ధి జరిగేలా దృష్టి పెడితే ఆర్థిక సుస్థిరత సాధించగలమన్నారు. గ్రామస్థాయిలో కూడా కీ-పెర్ఫామెన్స్ ఇండికేటర్లు పెడితే… క్షేత్ర స్థాయిలో పోటీతత్వం పెరుగుతుందని చెప్పారు. సమీక్షల్లో సీఎస్ విజయానంద్తో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.