Saturday, June 21, 2025
Homeస్త్రీలకు ఉచిత ప్రయాణంపైముందడుగు

స్త్రీలకు ఉచిత ప్రయాణంపైముందడుగు

కొత్త బస్సుల కొనుగోలుకు చర్యలు వేగవంతం
సీఎస్‌ అధ్యక్షతన స్టీరింగ్‌ కమిటీ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సూపర్‌సిక్స్‌లో అత్యంత కీలకమైన మరో హామీ స్త్రీలకు ఉచిత ప్రయాణం అమల్లోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే దీనిపై ప్రకటన చేశారు. సీఎం ఆదేశాలకనుగుణంగా ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేసేందుకు అధికారయంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా ఈలోపే సరికొత్త బస్సులను రోడ్డెక్కించేందుకు చర్యలు తీసుకుంటోంది. పీఎంఈ-బస్‌ సేవా’ పథకం కింద కేంద్రం సమకూర్చే ఎలక్ట్రిక్‌ బస్సుల కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 750 ఎలక్ట్రిక్‌ బస్సులను కేటాయించగా, బస్సుల కొనుగోలు కోసం తగిన ప్రతిపాదనలను ముందుగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించాల్సి ఉంది. ప్రతిపాదనల తయారీ కోసం రాష్ట్ర స్థాయి స్టీరింగ్‌ కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ అధ్యక్షతన స్టీరింగ్‌ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీలో మరో ఆరుగురు సభ్యులను కూడా నియమించింది.
కమిటీ కన్వీనర్‌గా ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వ్యవహరిస్తారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సహా రవాణా, ఆర్థిక, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శులను కమిటీలో సభ్యులుగా నియమించింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 11 నగరాల్లో ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. వీటి కొనుగోలు కోసం ప్రతిపాదనలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేయాలని నిర్దేశించింది. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎస్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మొత్తం ప్రక్రియను ఆగస్టు మొదటి వారానికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు