Thursday, May 15, 2025
Home19 ప్రాజెక్టులకు ఓకే

19 ప్రాజెక్టులకు ఓకే

. రూ.33 వేల కోట్ల పెట్టుబడులు
. 35 వేల మందికి ఉపాధి
. 6వ ఎస్‌ఐపీబీ సమావేశం ఆమోదం
. ప్రాజెక్టుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ: చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పాలసీతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుని వెనువెంటనే ప్రాజెక్టుల స్థాపనకు శ్రీకారం చుడుతున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు శంకుస్థాపనలు చేయగా… మరికొన్ని కంపెనీలు పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఈ 11 నెలల కాలంలో ఎస్‌ఐపీబీ ఇప్పటికి ఆరుసార్లు సమావేశం కాగా… 76 ప్రాజెక్టులకు సంబంధించి రూ.4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 4,50,934 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. తాజాగా గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 6వ ఎస్‌ఐపీబీ సమావేశంలో 19 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. వీటికి సంబంధించి రూ.33 వేల కోట్లకు పైగా పెట్టుబడులు రానుండగా, ఇంధనం, పర్యాటకం, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో దాదాపు 35 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ప్రాజెక్టుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముందుకు వచ్చి ఒప్పందాలు చేసుకున్న సంస్థలు… ప్రాజెక్టుల శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ఆయా సంస్థల పెట్టుబడులు, క్షేత్రస్థాయి పనుల స్థితిగతులు తెలుసుకునేందుకు డాష్‌ బోర్డ్‌ తీసుకురావాలని, తద్వారా ఏ ప్రాజెక్టు ఏ స్థాయిలో ఉందనే విషయం తెలుసుకోవచ్చని, పెట్టుబడులతో పాటు వచ్చిన ఉద్యోగాల వివరాలతో పోర్టల్‌ రావాలని సూచించారు. ఎస్‌ఐపీబీ సమావేశాల్లో కొత్త పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులకు సంబంధించిన పురోగతి వివరించాలని సీఎం మార్గనిర్దేశనం చేశారు.
50 వేల హోటల్‌
రూములు లక్ష్యం
పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుపై చంద్రబాబు మాట్లాడుతూ పర్యాటకరంగంలో హోటళ్లు, రూముల కొరత ఉందపి. పెద్దఎత్తున హోటల్‌ రూములు వస్తే పర్యాటకానికి ఊపు వస్తుందన్నారు. అందుకే 50 వేల రూములు అందుబాటులోకి తీసుకురావాలని, హోటల్‌ రూముల ధరలు అందుబాటులో ఉంటే పర్యాటకులు ఆయా ప్రాంతాల్లో బస చేస్తారన్నారు. కారవాన్స్‌కు సంబంధించి పాలసీని సిద్ధం చేసి అమల్లోకి తీసుకురావడం ద్వారా పర్యాటకులకు కొత్త అనుభూతి కలుగుతుందన్నారు. తద్వారా పర్యాటక ఆదాయం పెరుగుతుందన్నారు. ముఖ్యంగా దేవాలయాలకు వచ్చే భక్తులకు మంచి వసతి కల్పించడం చాలా ముఖ్యమని, కుటుంబాలతో వచ్చే వారు ప్రశాంతమైన, పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలని అనుకుంటారన్నారు. రాష్ట్రంలో రద్దీగా ఉండే 21 దేవాలయాల్లో వసతి సౌకర్యం పెంచే చర్యలు తీసుకోవాలని, టెంట్లు (గుడారాలు) ఏర్పాటు చేసి వసతి కల్పించే ప్రాజెక్టులు ప్రారంభించాలన్నారు. అదేవిధంగా గోదావరి, కృష్ణానదుల వద్ద నిర్వహిస్తున్న హారతుల కార్యక్రమాలను ఆధ్యాత్మిక శోభ పెంచేలా చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఐ అండ్‌ సి డిపార్ట్‌మెంట్‌
1) డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌: కుమరవరం, అనకాపల్లి జిల్లా – రూ.1,560 కోట్ల పెట్టుబడులు, 1,800 ఉద్యోగాలు
2) భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌: పాలసముద్రం, శ్రీ సత్యసాయి జిల్లా- రూ.1,400 కోట్ల పెట్టుబడులు, 800 ఉద్యోగాలు
3) పీయూఆర్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌: ఓర్వకల్‌, కర్నూలు జిల్లా- రూ.1,286 కోట్ల పెట్టుబడులు, 1,200 ఉద్యోగాలు
4) బ్లూ జెట్‌ హెల్త్‌ కేర్‌ లిమిటెడ్‌: రాంబిల్లి, అనకాపల్లి జిల్లా- రూ.2,300 కోట్ల పెట్టుబడులు, 1,750 ఉద్యోగాలు
5) జుపిటర్‌ రెన్యూవబుల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: రాంబిల్లి, అనకాపల్లి జిల్లా- రూ.2,700 కోట్ల పెట్టుబడులు, 2,216 ఉద్యోగాలు
టెక్స్‌టైల్‌ డిపార్ట్‌మెంట్‌
6) రాంభద్ర ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా – రూ.228 కోట్ల పెట్టుబడులు, 250 ఉద్యోగాలు
7) మోహన్‌ స్పింటెక్స్‌: మాలవల్లి, కృష్ణా జిల్లా – రూ.482 కోట్ల పెట్టుబడులు, 1,525 ఉద్యోగాలు
8) ఏటీసీ టైర్స్‌ ఏపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌: అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లా- రూ.1,779 కోట్ల పెట్టుబడులు, 600 ఉద్యోగాలు
ఏపీఐఐసీ డిపార్ట్‌మెంట్‌
9) వింగ్‌టెక్‌ మొబైల్‌ కమ్యూనికేషన్స్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌: తిరుపతి జిల్లా – రూ.1,061 కోట్ల పెట్టుబడులు, 10,098 ఉద్యోగాలు
10) అలీప్‌ కుప్పం: చిత్తూరు జిల్లా – రూ.5 కోట్ల పెట్టుబడులు, 1,500 ఉద్యోగాలు
ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌
11) నితిన్‌సాయి కనస్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: ఏలూరు జిల్లా – రూ.150 కోట్ల పెట్టుబడులు, 500 ఉద్యోగాలు
12) దేశ్‌రాజ్‌ సోలార్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు – రూ.2,920 కోట్ల పెట్టుబడులు, 230 ఉద్యోగాలు
13) ఆంప్లస్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: కడప జిల్లా – రూ.3,941 కోట్ల పెట్టుబడులు, 260 ఉద్యోగాలు
14) బొండాడ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు- రూ.9,000 కోట్ల పెట్టుబడులు, 3,900 ఉద్యోగాలు
టూరిజం డిపార్ట్‌మెంట్‌
15) బెంగాల్‌ అల్టిమేట్‌ రిసార్ట్స్‌ ఎల్‌ఎల్‌పి: తిరుపతి – రూ.150 కోట్ల పెట్టుబడులు, 350 ఉద్యోగాలు
16) స్రవంతి హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: తిరుపతి – రూ.327 కోట్ల పెట్టుబడులు, 570 ఉద్యోగాలు
17) వరుణ్‌ హాస్పిటాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌: విశాఖపట్నం – రూ.899 కోట్ల పెట్టుబడులు, 1,300 ఉద్యోగాలు
ఐటీ డిపార్ట్‌మెంట్‌
18) డైకిన్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌: శ్రీసిటీ, తిరుపతి జిల్లా – రూ.2,475 కోట్ల పెట్టుబడులు, 5,150 ఉద్యోగాలు
19) సెన్సోరెమ్‌ ఫోటోనిక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌: కర్నూలు జిల్లా- రూ.1,057 కోట్ల పెట్టుబడులు, 622 ఉద్యోగాలు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు