యూఎఫ్బీయూ ప్రకటన
న్యూదిల్లీ : మార్చి 24, 25 తేదీల్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె కొనసాగుతుందని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) ప్రకటించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో జరిగిన చర్చలు ఎలాంటి సానుకూల ఫలితాలు ఇవ్వకపోవడంతో సమ్మెపై నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అన్ని కేడర్లలో నియామకాలు, వారంలో ఐదురోజుల పని తదితర డిమాండ్లపై చర్చించేందుకు యూఎఫ్బీయూ సభ్యులు ఐబీఏను కలిశారు. ఆయా డిమాండ్లపై ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకోలేదని నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్సీబీఈ) ప్రధాన కార్యదర్శి ఎల్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. తొమ్మిది బ్యాంక్ ఉద్యోగ సంఘాలతో కూడిన యూఎఫ్బీయూ ఇప్పటికే డిమాండ్లపై సమ్మె ప్రకటించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగి, ఆఫీసర్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ సైతం ఉన్నది. ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) ఇటీవల సూచనలను ఉపసంహరించుకోవాలని సైతం యూఎఫ్బీయూ డిమాండ్ చేస్తోంది. ఈ సూచనలు ఉద్యోగుల ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని, ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆరోపించారు. గ్రాట్యూటీ చట్టాన్ని సవరించాలని, పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని, ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని యూఎఫ్బీయూ డిమాండ్ చేస్తోంది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్లో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్సీబీఈ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ) ప్రధాన బ్యాంకు సంఘాలు ఉన్నాయి.