జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ఃలో పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు భారత్ తీవ్రంగా స్పందించింది. మే నెల ఆరంభంలో జరిగిన ఈ సైనిక చర్యలో పాకిస్థాన్ వైమానిక దళానికి (పీఏఎఫ్) చెందిన ఆరు యుద్ధ విమానాలు, రెండు అత్యంత కీలకమైన నిఘా విమానాలు, పదికి పైగా సాయుధ డ్రోన్లు, ఒక సీ-130 హెర్క్యులస్ రవాణా విమానం ధ్వంసమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సైనిక ఘర్షణ అనంతరం జరిపిన విశ్లేషణలో పాకిస్థాన్ వైమానిక, భూతల సైనిక ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు స్పష్టమైంది. భారత వైమానిక దళం జరిపిన ఎదురుదాడుల్లో ఈ ఆరు పీఏఎఫ్ యుద్ధ విమానాలు గాల్లోనే నేలకూలాయి. పాకిస్థానీ పంజాబ్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రాంతాల్లో ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాడార్ ట్రాకింగ్, భారత భూస్థిత క్షిపణి వ్యవస్థలు, గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు నమోదు చేసిన థర్మల్ సిగ్నేచర్ల ద్వారా ఈ విమానాల విధ్వంసాన్ని ధ్రువీకరించినట్టు సమాచారం. దాడుల అనంతరం ఈ విమానాలు ట్రాకింగ్ గ్రిడ్ల నుంచి అదృశ్యమైనట్లు ఈ వర్గాలు పేర్కొన్నాయి.