మంగళవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన బాలిక
ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. మూగ, చెవిటి బాలిక (11) దారుణ అత్యాచారానికి గురైంది. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గుర్తించిన గ్రామస్థులు.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని గుర్తించారు. అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపైకి నిందితుడు కాల్పులు జరపగా.. పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో నిందితుడి కాలికి బుల్లెట్ గాయమైంది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత చిన్నారి మంగళవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించగా.. బుధవారం ఉదయం గ్రామ సమీపంలోని ఓ పొలంలో నగ్నంగా, అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స నిమిత్తం వైద్యులు మీరట్కు రెఫర్ చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. అదే గ్రామానికి చెందిన డాన్ సింగ్ (24) అనే యువకుడు బాలికను తీసుకెళ్లినట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులపై కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడు డాన్ సింగ్ కాలికి బుల్లెట్ గాయమైందని రాంపూర్ ఎస్పీ విద్యాసాగర్ మిశ్రా తెలిపారు. నిందితుడు బాలికతో ఆమె ఇంటి వద్ద మాట్లాడి, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలుస్తోందని పోలీసులు పేర్కొన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, బాలికపై అత్యంత క్రూరంగా అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు.
మూగ, చెవిటి బాలికపై అఘాయిత్యం.. యూపీలో దారుణం
RELATED ARTICLES