ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడి
ఇటీవల కశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా, భారత ప్రభుత్వం పాకిస్థాన్పై పలు కీలక ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా, పాకిస్థాన్ నుంచి భారత్కు వచ్చే అన్ని రకాల మెయిల్స్, పార్సిళ్ల మార్పిడిని తక్షణమే నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. వాయు మార్గం (విమానాల ద్వారా) లేదా ఉపరితల మార్గం (రోడ్డు, రైలు ద్వారా) ద్వారా వచ్చినా ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది.ఇప్పటికే పాకిస్థాన్ నుంచి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ జరిగే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా తీసుకున్న మెయిల్స్, పార్సిళ్ల నిలిపివేత నిర్ణయం ఈ ఆంక్షల పరంపరలో మరొకటి.
అంతేకాకుండా, ఇరు దేశాల మధ్య సముద్ర మార్గ రవాణాను కూడా భారత్ మూసివేసింది. పాకిస్థాన్ జెండాతో ప్రయాణించే ఏ నౌక అయినా భారత ఓడరేవుల్లోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు. అదే సమయంలో, భారతీయ నౌకలు కూడా పాకిస్థాన్ ఓడరేవులకు వెళ్లకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆంక్షలన్నీ తక్షణమే అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు.
కాగా, పాకిస్థాన్ విమానాలు భారత గగనతలంపై ప్రయాణించకుండా ఇప్పటికే నిషేధం అమలులో ఉంది. వీటితో పాటు, పాకిస్థాన్కు ఎలక్ట్రానిక్స్, ఈ-కామర్స్ వస్తువుల ఎగుమతిని కూడా పరిమితం చేసే దిశగా భారత్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వీటిపై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉంది.