Sunday, June 22, 2025
Homeవిశ్లేషణవ్యవస్థ మార్పు కోసం

వ్యవస్థ మార్పు కోసం

ప్రస్తుత సమాజంలో వ్యవస్థ మారాలంటే సైనిక పాలన తప్పదు. అంతే నేనిక ప్రజాస్వామ్యాన్ని నమ్మి కూర్చోలేను. ఇంతకాలం వేచి చూశాను. మార్పు లేదు. పార్టీల మార్పు తప్ప వ్యవస్థలో మార్పు ఏ మాత్రం కనపడదు. ఇక నా ఓర్పు, సహనం నశించిపోయాయి. నక్సలైట్లలో కలవాలనే కోరిక బలపడుతోంది. ఏంటి బావ పొద్దునే నక్సలైట్లు అంటున్నావు. అవునయ్యా ఇక్కడ జీవచ్ఛవంలా బతికే కంటే సమాజ మార్పుకోసం నక్సలైటుగా చనిపోవడమే మంచిది కదా. భలేవాడివయ్యా ఈ మధ్య నక్సలైట్లను చంపి శవాలను కూడా బంధువులకు ఇవ్వలేదు. దేశ ప్రజల కోసం ప్రాణాలర్పించిన నక్సలైట్ల శవాలను అనాధ శవాలుగా మార్చింది ఈ మోదీ ప్రభుత్వం. ఈ పరిస్థితిలో నక్సలైటుగా మారి సాధించేదేమీ ఉండకపోవచ్చు. కమ్యూనిస్టు పార్టీ నుంచి విడిపోయే సమయంలోనే అడవుల పాలయి సాధించేదేమీ ఉండదని మారుతున్న కాలంలో టెక్నాలజీ పెరిగి చెట్టు తొర్రల్లో దాక్కున్నా కనిపెట్టి నిర్ధాక్షిణ్యంగా కాల్చి వేస్తారని ఆనాటి కమ్యూనిస్టు నాయకులు చెప్పినా చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి పెడచెవిన పెట్టారు. బ్యాలెట్‌ బాక్సుల ద్వారా ఓట్లు వేసి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని పడగొట్టలేమని ప్రపంచంలో ఎక్కడా ఓట్ల ద్వారా ప్రభుత్వాలు మారలేదని యుద్ధం అనివార్యమని వారు ప్రాణాలర్పించారు. నిజమేనయ్యా అది 1967లో జరిగిన సంఘటన అయినా ఇప్పటికి ఏ విధంగాను మార్పు రాలేదు. నిజమే ప్రస్తుతం తామంతా ప్రజల కోసమే కష్టపడుతున్నామని ప్రతిపక్షం అవసరం లేదని పాలక పక్షాలు అంటున్నాయి. ప్రతిపక్షం అంటే అభివృద్ధి నిరోధకులని భావన ప్రజల్లో కలిగించే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనదని చెప్పుకుంటూ ప్రతిపక్షం అవసరం లేదని అంటున్నారంటే ఇక మనకు స్వేచ్ఛ అనేది ఎక్కడుందో తెలియదు. రానురాను ప్రజాస్వామ్యం పేరిట రాచరిక పాలన సాగుతోందనడంలో అతిశయోక్తి లేదు. సామాన్య పౌరుల సంగతి పక్కన పెట్టినా ప్రజలెన్ను కున్న శాసనసభ్యునికిగాని, శాసనసభ్యులెన్నుకున్న మంత్రులకు గాని శాసనాలు అమలుపరిచే ఐఏఎస్‌, ఐపీయస్‌లకు కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది.
ఇదంతా నిజమే అట్లని సైనిక పాలన ఎలా కోరుకుంటాం. ఒక ప్రజాస్వామ్యవాదిగా అలా కోరుకోం కదా. ప్రజల్ని ప్రజలే పాలించు కోవాలని మనం ఎన్నుకుంటే పైనుంచి కింది స్థాయి వరకు సంపాదనకు అలవాటుపడి వారి కర్తవ్యం మరిచిపోయి ఎన్నుకున్న ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో ప్రతిపక్షంలోని లోహియా, కృపలాని, సుందరయ్య, హిరేన్‌ముఖర్జీ లాంటి వారి సూచనలకు విలువిచ్చి స్వీకరించేవారు. ఇందిరాగాంధీ నుంచి దాదాపు నియంతపాలన మొదలుకాగా అది అన్ని రాష్ట్రాలు ఏలేవారికి వరంగా మారింది. అంతటితో ఆగక అంతా మేమే చూస్తాం ప్రతిపక్షం ఎందుకని ప్రశ్నిస్తున్నారంటే మనం ఇంకా ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా అనే సందేహం కలుగక మానదు. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన ప్రణబ్‌ముఖర్జీ, ఉపరాష్ట్రపతిగా పదవీవిరమణ చేసిన అన్సారీ కూడా ఉభయసభల్లో చర్చ అవసరమని అన్నారు. కాని వారి మాటలు వినిపించుకునేవారు ప్రస్తుతం పాలకుల్లో కనబడటం లేదు.
నిజమేనయ్యా రోజులు గడుస్తున్న కొద్దీ నేను నా సమాజం అనే ఆలోచనమాని నేను నా కుటుంబం అని ఆలోచించి స్వార్థ చింతనతో సంపాదన కోసం ఆలోచిస్తున్నారు. ప్రజలిచ్చిన పదవి అడ్డం పెట్టుకుని వ్యాపారాలు పెంచుకోవడంతో పాటు ప్రజల ఆస్తిని కొల్లగొడుతున్నారు. ఎవరికి వారు ఒకరిని మించి మరొకరు తదుపరి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సంపాదించడంలో పోటీ పడుతున్నారే తప్ప ఎన్నుకున్న ప్రజల సమస్యలు గాలి కొదిలేస్తున్నారు. ఎన్నికల్లో ఒకరిని మించి మరొకరు ఓట్లు కొనుగోలు చేయడంలో పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితి చూసి మేధావులు మౌనం వహిస్తే నిరుపేదలు మా గతి ఇక ఇంతేనా అని వేడి నిట్టూర్పు విడుస్తున్నారు. ఈ సమయంలో కొందరు విరక్తితో ప్రజలను ఆదుకోవాలని దోపిడీదారుల్ని అంతమొందించాలని నక్సలైట్లగా మారుతున్నమాట నిజమే. కాని వారి ఆశయం నెరవేరక ముందే ప్రాణాలు కోల్పోతున్నారు. కమ్యూనిస్టులు 1940`60 మధ్యలో ప్రతి గ్రామంలో ప్రజలతో మమేకమై వారి సమస్యలు తీర్చడంలో ముందు నిలబడ్డారు. దాంతో ప్రజలకు వారు దేవుళ్లుగా కనిపించారు. ప్రతి గ్రామంలో సెంటరులో చెట్టుపైన, ఇంటిపైనా ఎర్రజెండా ఎగరేశారు. దాంతో 1952 లో జరిగిన మొదటి ఎన్నికలలో ఊహించని ఫలితాలొచ్చి 1955 ఎన్నికలలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకోగా ఫలితాలు తారుమారైనాయి. అనుకోని విధంగా 1964లో పార్టీ చీలిపోయింది. 1967లో మరల చీలిపోయి నక్సలైటుగా మారిపోయారు. అప్పటి నుంచి కమ్యూనిస్టులు బలహీన పడటంతో కాంగ్రెసు విజృంభించి ప్రజల ఆస్తులు కొల్లగొడితే ప్రస్తుతం స్థానిక పార్టీలు ఆ పనిలో మునిగిపోయాయి. ఇక ప్రజలగోడు వినేవారెవరు అని సామాన్యులు మధనపడుతున్నారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజల తరపున పనిచేయాలంటే గతంలో వలే కమ్యూనిస్టులు, ప్రజాహితులు ప్రజాసేవ గ్రామాల్లో మొదలు పెట్టి గతంలో వలేె ప్రజలతో మమేకమై పనిచేసిన నాడు ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా మార్పు అనివార్యమై వ్యవస్థ మార్పునకు దోహదపడవచ్చు.
సెల్‌:988556394

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు