Saturday, June 21, 2025
Homeమస్తర్ల మాటున దోపిడి!

మస్తర్ల మాటున దోపిడి!

. ‘ఉపాధి’తో ఫీల్డ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లకు కాసుల పంట
. మామూళ్లమత్తులో పర్యవేక్షణాధికారులు
. పక్కదారి పడుతున్న ప్రజాధనం
. రాజకీయ ఒత్తిళ్లతో ప్రభుత్వానికి అవాస్తవ నివేదికలు
. కూటమి ప్రభుత్వంలోనూ అడ్డగోలు అవినీతి

విశాలాంధ్ర – సచివాలయం: గ్రామాల్లో పేదల ఆర్థిక పరిపుష్టికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బాసటగా నిలిచింది. ఇదే కొంత మంది ఫీల్డ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లకు కాసుల పంట పండిస్తోంది. పనులు కల్పించినందుకు కొందరి వద్ద, పనులకు రాకున్నా హాజరు వేసినందుకు మరికొందరి వద్ద సొమ్ములు వసూలు చేస్తూ ప్రజాధనాన్ని స్వాహా చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వీరు ఇష్టారా జ్యంగా వ్యవహరిస్తున్నా పర్యవేక్షించాల్సిన పైఅధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా ఆనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ … ఎప్పటికప్పుడు ‘ఉపాధి హామి’ అమలుపై సమీక్షలు నిర్వహిస్తూ అర్హులకు ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు గ్రామీణ ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని బలమైన సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వెచ్చిస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శలు పలు జిల్లాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో పెద్దఎత్తున ఉపాధి పనులు జరుగుతున్నాయి. అయితే ఆయా ప్రాంతాల్లో అంతే జోరుగా మస్తర్ల మాయాజాలం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అనేక కఠిన చర్యలు తీసుకున్నా అడ్డగోలు పనులకు అలవాటు పడిన కొందరు ఉద్యోగులు ఇప్పటికీ అదే ధోరణి కొనసాగిస్తున్నారు. కూలీల పేర్లతో బోగస్‌ మస్తర్లు వేసి వేతనాల సొమ్ము స్వాహా చేస్తున్నారు. చేయని పనులకు రికార్డులు సృష్టించి నిధులు జేబుల్లో వేసుకుంటున్నారు. 50 శాతం మంది కూలీలు మాత్రమే వసులకు వెళ్తున్నారు. మిగిలిన వారు పనులకు వెళ్లకపోయినా ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్ల మాయాజాలంతో ఆ కూలీలంతా వసులకు వెళ్లినట్లు మస్తర్లో నమోదు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పనులను పర్యవేక్షించాల్సిన ఎంపీడీఓలు, డ్వామా క్లస్టర్‌ ఏపీడీ, ఏపీఓలు ఆ బాధ్యతను విస్మరించడంతో ఫీల్డ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు కానులు దండుకునేందుకు మార్గం సుగమమైందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పనులు కల్పించినందుకు ఒక్కో కూలీ నుంచి వారానికి రూ. 200 నుంచి రూ.300 దాకా వసూలు చేస్తున్నారు. ఈ వసూళ్ల బాధ్యతను మేట్లకు అప్పగిస్తున్నారు. మేట్లు కూలీల నుంచి ఆ డబ్బులు వసూలు చేసి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ లకు చేరవేస్తున్నారు. ఆ వచ్చిన డబ్బులో మస్తర్లలో కూలీలను నమోదు చేసే టెక్నికల్‌ అసిస్టెంట్‌కు వాటా పంచుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో పనులకు వెళ్లకపోయినా మస్తర్లలో పనులకు వచ్చినట్లు కొందరి పేర్లు నమోదు చేస్తూ సొమ్ము చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. కూలీలతో ముందస్తు ఒప్పందంలో భాగంగానే ఈ వ్యవహారాన్ని సంబంధిత అధికారులు చక్కబెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా కాసులు దండుకు నేందుకు సహకరిస్తున్న ఆ పైస్థాయి అధికారులకు నెల మామూళ్లు ముట్టచెబుతున్నట్లు విమర్శలు గుప్పు మంటున్నాయి. అధికార పార్టీ స్థానిక నేతల అండదండలతోనే ఉపాధి హామీ పనుల్లో ఫీల్డ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు క్షేత్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ నేతలు ఎవరి పేర్లు చెబితే వారికి జాబ్‌ కార్డులు ఇవ్వడం. వారు పనులకు వెళ్లకపోయినా వారి పేరుతో డబ్బులు ఇంటికి చేరుస్తున్నారు. నిఘా బృందాలు ఇటీవల కొన్ని జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేసినప్పుడు అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణ అధికారులు కూడా జరిగిన అక్రమాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. కొందరు మండల స్థాయి అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు కుమ్మక్కై నిధులు స్వాహా చేస్తున్నట్లు కూడా అనేక జిల్లాల్లో విచారణ అధికారులు గుర్తిస్తున్నప్పటికీ స్థానికంగా ఉన్న రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో వారు వాస్తవ నివేదికలను ప్రభుత్వానికి ఇవ్వలేకపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక గ్రామాల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు తాము చెప్పిందే వేదంగా చేసిందే శాసనంగా దోచుకుంటున్నారు. వారిని ఎవరైనా జిల్లా స్థాయి అధికారులు ధైర్యం చేసి నిలదీస్తే స్థానికంగా ఉన్న అధికార పార్టీ నేతల పేర్లు చెప్పి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు