విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : సినిమాలో చెప్పే డైలాగ్లు థియేటర్ వరకే బావుంటాయని, బయట చట్ట నిబంధనలు పాటించాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్ సినిమా డైలాగులు చెబుతూ చేసిన వ్యాఖ్యలపై పవన్ స్పందించారు. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాలు వరకూ బాగుంటాయి. వాటిని ఆచరణలో పెడతాము… ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. ఎవరైనా చట్టం, నియమనిబంధనలు పాటించాల్సిందే. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించదు. కచ్చితంగా అలాంటివారిపై రౌడీ షీట్లు తెరిచి… అసాంఘిక శక్తులను అదుపు చేస్తాం. అశాంతిని, అభద్రతను కలిగించేవారికి మద్దతుగా అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడుతున్నవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వారిని ఓ కంట కనిపెట్టాలి. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసేవారిని కట్టడి చేయకపోగా… వారిని సమర్థించేలా మాట్లాడేవారి నేరమయ ఆలోచనలను ప్రజలంతా గమనించాలి. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమే అని మరచిపోవద్దని ప్రజలకు పవన్ సూచించారు.