విశాలాంధ్ర- అనంతపురం : అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అధికారులు, అధ్యాపకులు, విద్యార్థినీవిద్యార్థులు ఉత్సాహంగా జరుపుకున్నారు. విశాఖపట్నం నుండి ప్రధాన అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమం యొక్క ప్రత్యక్ష ప్రసారంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య ఎస్.ఎ. కోరి తన సందేశాన్ని అందించారు. ఆరోగ్యకరమైన మనస్సు, శరీరాన్ని పెంపొందించడంలో మరియు శాంతి, సామరస్యాన్ని ప్రోత్సహించడంలో యోగ పాత్రను వారు వివరించారు. యోగ కేవలం శారీరక వ్యాయామం అనుకుంటే పొరపాటు;ఇది స్వీయ-ఆవిష్కరణ మరియు సమగ్ర శ్రేయస్సు వైపు ఒక లోతైన ప్రయాణం అని వైస్-ఛాన్సలర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య సి. షీలా రెడ్డి పాల్గొన్నారు. ఆమె తన ప్రసంగంలో పరిపూర్ణ శ్రేయస్సు కోసం యోగ యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రధానంగా వివరించారు. మన అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలకు చక్కటి స్పందన రావడం చూసి మేము సంతోషిస్తున్నాము అని రిజిస్ట్రార్ అన్నారు.ఈ వేడుకలో వివిధ విభాగాలకు చెందిన బోధన, బోధనేతర సిబ్బంది, జాతీయ సేవా పథకం (ఎన్. ఎస్. ఎస్) విద్యార్థులు, సిబ్బంది, పరిశోధన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.