ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ కీలక భేటీ అసంపూర్తిగా ముగిసింది. ఉక్రెయిన్తో యుద్ధం ఆపే దిశగా అలస్కా వేదికగా ఇరువురు దేశాధినేతల సమావేశం ఉంటుందని అంతా అనుకున్నప్పటికీ.. ఎలాంటి ఒప్పందం కుదరకుండానే చర్చలు ముగిశాయి. సుమారు 3 గంటలపాటు వీరి సమావేశం జరిగింది. భేటీ అనంతరం ఇరువురు నేతలు భేటీ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా.. సమావేశం ఫలప్రదమైందని ట్రంప్ అన్నారు. భేటీలో అనేక అంశాలపై చర్చించామని తెలిపారు. తమ చర్చల్లో ఎంతో పురోగతి లభించిందని, అయితే కొన్ని సమస్యలను ఇంకా పరిష్కరించుకోవాల్సి ఉందని చెప్పారు. తుది ఒప్పందం మాత్రం కుదరలేదని వెల్లడించారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించామని, అయితే కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా ఒప్పందంపై సంతకం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. త్వరలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఈయూ నేతలతో మాట్లాడతానని చెప్పారు. మళ్లీ పుతిన్ను కలుస్తానని చెప్పగా, తదుపరి సమావేశం మాస్కోలో ఉంటుందని ప్రకటించారు. అలస్కాలో ట్రంప్తో సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగిందని వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రధాన అంశంగా చర్చించామన్నారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయతీగా ఉన్నానని, ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి పునాది అని వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్నకు ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాల విషయాలలో క్లిష్టకాలంలో అధ్యక్షుడు ట్రంప్తో మాస్కో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నదని చెప్పారు. ఉక్రెయిన్పై ట్రంప్ , తాను ఒక అవగాహనకు వచ్చామన్నారు. చర్చల పురోగతిని దెబ్బతీయవద్దని ఈయూని హెచ్చరించారు. 2022లో ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్ పునరుద్ఘాటించారు. తదుపరి సమావేశం కోసం ట్రంప్ను మాస్కోకు రావాల్సిందిగా పుతిన్ ఆహ్వానించారు.
అసంపూర్తిగా ముగిసిన ట్రంప్, పుతిన్ భేటీ..
- Advertisement -
RELATED ARTICLES


