. సెకీతో ఒప్పందంతో ప్రజలపై రూ.1.10 లక్షల కోట్ల భారం
. విలువైన భూములు అదానీకి దోచిపెట్టిన జగన్
. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు ప్రజల పక్షాన నిలుస్తారా?… తేల్చుకోవాలి
. రైతులు, వలంటీర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: గత ప్రభుత్వ హయాంలో ఆదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని, దాని కోసం ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపర్చి… సభలో తీర్మానించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ దాసరిభవన్లో సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ, పి.హరనాథరెడ్డితో కలిసి రామకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. విద్యుత్ ఒప్పందాల రద్దుపై తాజాగా సీబీఐ మాజీ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారని రామకృష్ణ వెల్లడిరచారు. విద్యుత్ ఒప్పందాలతోపాటు వివిధ అంశాలపై అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పాలనను చక్కదిద్దుతామని చెప్పిన చంద్రబాబు… ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆ లేఖలో మన్నెం నాగేశ్వరరావు ప్రశ్నించారని పేర్కొన్నారు. ఈ లేఖపైన ప్రభుత్వం స్పందించాలని కోరారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు, ఇతర అంశాలను ఏ మాత్రం టచ్ చేయకుండా కేవలం మాజీ సీఎం జగన్పై రూ.1750 కోట్ల అవినీతి ఆరోపణలపై ఏసీబీతో దర్యాప్తు చేయించాలంటూ టీడీపీ పొలిట్బ్యూరో, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యల్ని తోసిపుచ్చారు. విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగిందన్న దానిపై ఎవరున్నప్పటికీ..తప్పకుండా విచారణ జరిపించాల్సిందేనని చెప్పారు. రాబోయే 25 ఏళ్లలో రాష్ట్రంలోని 26 జిల్లాల ప్రజలపైన రూ.లక్షా 10 వేల కోట్ల భారం పడబోతుంటే… దానిని టచ్ చేయవద్దని ఎవరైనా చెప్పారా? అని యనమలను సూటిగా ప్రశ్నించారు. అంటే ఈ భారాన్ని ప్రజలు భరించేందుకు సిద్ధంగా ఉన్నారని, మీరు భావిస్తున్నారా? అని నిలదీశారు.గత జగన్ ప్రభుత్వ హయాంలో సెకీ ద్వారా జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో ప్రజలపై భారం పడిరదని, పైపెచ్చు విద్యుదుత్పత్తి అంతా రాజస్థాన్లోనే కొనసాగడం వల్ల.. ఆ రాష్ట్రానికే అన్ని విధాలా లాభం జరుగుతోందన్నారు. దాదాపు 14వేల మందికి అక్కడ ఉద్యోగాలు వచ్చాయని, భూములిచ్చిన వారికి 30 ఏళ్లపాటు ప్రయోజనాలు కల్పిస్తున్నారని, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.8వేల కోట్లు పన్నుల రూపంలో ఆదాయం వస్తోందని చెప్పారు. అటు రాజస్థాన్కు అన్ని ప్రయోజనాలు కల్పిస్తూ, భారం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలపై వేయడం దుర్మార్గమన్నారు. ఎన్టీపీఎస్ ద్వారా గుజరాత్ ప్రభుత్వం రూ.1.99 పైసలకు కొనుగోలు చేసిందని, సెకీ నుంచి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం 2.49 పైసలకు కుదుర్చుకుందని, ఒక యూనిట్కు అదనంగా 50 పైసలు నిర్ధారించి, 25 ఏళ్లపాటు ప్రజలపై పెనుభారం మోపనున్నారని చెప్పారు. కృష్ణపట్నం పోర్టును నవయుగ నుంచి తప్పించి, బెదిరించి జగన్ హయాంలో ఆదానీకి అప్పగించారని గుర్తుచేశారు. గంగవరం పోర్టునూ ప్రభుత్వానికి రావాల్సి ఉండగా, అతి తక్కువ ధరకు ఆదానికి జగన్ వేలాది ఎకరాల భూములు దోచిపెట్టారని మండిపడ్డారు. జగన్కు ప్రతిపక్ష హోదా లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నందున, విద్యుత్ ఒప్పందాల్ని రద్దు చేసుకునేందుకుగాను ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి, అందులో 164 మంది అధికార కూటమి ఎమ్మెల్యేలు చర్చించాలన్నారు. బీజేపీ నాయకురాలు పురందేశ్వరి మాట్లాడుతూ ఆదానీకి, బీజేపీకి సంబంధంలేదంటూ చేసిన వ్యాఖ్యల్ని రామకృష్ణ తప్పుపట్టారు. ఇవాళ నరేంద్ర మోదీ, అమిత్షా లేకపోతే ఆదానీ లేడని నొక్కిచెప్పారు. నేడు ఆదానీ విద్యుత్ ఒప్పందాల అవినీతిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని, అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (ఎఫ్బీఐ) దర్యాప్తు పూర్తయ్యాకనే నివేదికను సమర్పించారని గుర్తుచేశారు. ఆ నివేదికలో ఆదానీ రూ.2100 కోట్లు 4 రాష్ట్రాలలో లంచాలుగా ముట్టజెప్పారని, అందులో రూ.1750 కోట్లను ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఇచ్చినట్లుగా నివేదించారని వివరించారు. జగన్ సైతం ఈనాడు, ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్ల చొప్పున పరువు నష్టం వేసి ఊరుకున్నారని, ఈ వార్తను ఆ రెండు పేపర్లే రాశాయా? అని ప్రశ్నించారు. దేశ, విదేశాల్లో ఉన్న మీడియా సంస్థలు జగన్పై కథనాలు రాశాయని, వాటిపైనా కూడా పరువు నష్టం వేయాలికదా అని అన్నారు. రాష్ట్రంలో ఆదానీకి భయపడే రాజకీయం నడుస్తోందని, ఆదానీకి సరెండర్ అవుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రజల పక్షాన నిలబడతారా?, లేక ఆదానీకి దోచిపెడతారా? తేల్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పరిపాలన నిష్పక్షపాతంగా జరగడంలేదని, కాకినాడ పోర్టుకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెళ్లి అక్కడి షిప్ను సీజ్ చేయమని ఆదేశించడం చాలా సంతోషమన్నారు. కొంతకాలంగా కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నదని, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు. అదే సమయంలో గంగవరం పోర్టులోనూ ఇదే కొనసాగుతున్నదనీ, అక్కడికి పవన్ కల్యాణ్ ఎందుకు వెళ్లలేకపోతున్నారని, అది ఆదానీదనే వెనక్కి జంకుతున్నారా? అని ప్రశ్నించారు. కాకినాడ పోర్టు అరబిందోది కాబట్టే చర్యలకు ఉపక్రమించినట్లున్నదనీ, దీని వలన పాలన నిష్పక్షపాతంగా లేదనేదీ తేటతెల్లమవుతుందని రామకృష్ణ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, తుఫాన్లతో ఇబ్బందులకు గురవుతున్న రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలన్నారు. కనీసం రైతులు ధాన్యం ఆరబెట్టుకునేందుకు అవసరమైన టార్పాయిన్లు ఇవ్వడం లేదని, ధాన్యం వర్షంతో తడచి ముద్దవుతోందని చెప్పారు. రైతుల పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని, ఈ అంశాలపై సీఎం చంద్రబాబు, రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను కలిసి విన్నవిస్తామన్నారు. మేనిఫెస్టోలో రైతులకు హామీ ఇచ్చిన రూ.20వేలు ఇవ్వలేదని, కష్టాల్లో ఉన్న రైతులను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వలంటీర్లకు రూ.10వేలు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్థిక పరిస్థితుల రీత్యా..అంత ఇవ్వలేకపోతే ప్రస్తుతానికి రూ.5వేల గౌరవ వేతనం ఇచ్చి వలంటీర్లను యథాతథంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. వలంటీర్ల విషయంలో రాజకీయం తగదని, సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని రామకృష్ణ కోరారు.