బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉండటంతో హోంమంత్రి వంగలపూడి అనిత ఈ రోజు (శుక్రవారం) కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు.ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయమని, ప్రమాదకర పాయింట్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయమని ఆదేశాలు జారీ చేశారు.
అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హోంమంత్రి గుర్తు చేశారు.ముఖ్యంగా కోస్తాంధ్ర, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
వర్షాల నేపథ్యంలో, అవసరమైతే సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్,ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, ఫైర్ సిబ్బంది పూర్తిగా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.మత్స్యకారులు ఈ పరిస్థితుల్లో సముద్రానికి వెళ్ళవద్దని హెచ్చరించారు.పొంగిపోయే కాలువలు, రోడ్లను దాటడానికి ప్రయత్నించరాదని, వీధుల్లో గాలులు ఎక్కువగా ఉన్నప్పుడు చెట్ల కింద లేదా శిథిలంగా ఉన్న నిర్మాణాల పక్కన నిలవరాదు అని స్పష్టంగా సూచించారు.ఇక వాతావరణ శాఖ ప్రకారం,ఉత్తర,మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయువ్య, పశ్చిమగ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడి.. రేపు దక్షిన ఒడిశా-ఉత్తరాంధ్ర వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.దీని ప్రభావంతో ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు,బాపట్ల,పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.


