ఆంధ్రప్రదేశ్ అంతటా మొంథా తుపాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.ఇప్పటికే కోస్తా ప్రాంతంలోని జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. రాయలసీమ జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 233 మండలాలు, 1,419 గ్రామాలు, 44 మున్సిపాలిటీలను తుపాను ప్రభావం చుట్టుముట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది.ఈ ప్రభావిత ప్రాంతాల్లో 2,194 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.అదేవిధంగా 3,465 మంది గర్భిణీలు,బాలింతల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది.
సిద్ధంగా11 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు,12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
అంతేకాకుండా, రాష్ట్రంలోని 19 జిల్లాల పరిధిలో 54 రెవెన్యూ డివిజన్లలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.కమ్యూనికేషన్ సౌకర్యాల కోసం 16 శాటిలైట్ ఫోన్లు, 35 డీఎంఆర్ సెట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.అత్యవసర పరిస్థితుల కోసం 11 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు,12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.


