ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు 6,83,623 మంది రైతుల నుంచి రూ.9,890 కోట్ల విలువైన 41.69 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఇదే సమయంలో రూ.9,800 కోట్లను కేవలం 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేశామని ఆయన చెప్పారు.ఇకపై రైతులు ఉదయం ధాన్యం అందిస్తే అదేరోజు సాయంత్రానికి నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.రబీ ధాన్యం కొనుగోలుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని, అలాగే రైతు సేవా కేంద్రాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకునేలా అధికారులు శిక్షణ పొందేలా చూడమని సూచించారు.
సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తాం
సోమవారం ఉదయం విజయవాడలోని పౌరసరఫరాలశాఖ కమిషనరేట్లో ధాన్యం కొనుగోలుపై సమావేశం నిర్వహించిన మంత్రి, తిరుపతి, నెల్లూరు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో ఖరీఫ్ ధాన్యం సేకరణ కొనసాగుతుందని వివరించారు.రైతులు ఇబ్బంది పడకుండా, కృష్ణా మరియు గుంటూరు జిల్లాల నుంచి ధాన్యం తరలించడానికి ప్రత్యేక రైలు కూడా తొలిసారిగా ఏర్పాటు చేశామన్నారు.తేమ శాతం, GPS, రవాణా సమస్యలను సమర్థవంతంగా అధిగమించినట్టు ఆయన పేర్కొన్నారు.అలాగే, రబీ సీజన్లో గోతాలు, రవాణా, నిల్వ సౌకర్యాల విషయంలో సమస్యలు ఉండకుండా చూడమని మంత్రి సూచించారు. సమావేశంలో పౌరసరఫరాల సంస్థ వీసీ, ఎండీ ఢిల్లీరావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.


