పశ్చిమాసియాలో మరో యుద్ధ జ్వాల మొదలైంది. పొరుగు దేశాలైన పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. గత కొంతకాలంగా సరిహద్దు గొడవలతో సతమతమవుతున్న ఈ రెండు దేశాలు.. ఇప్పుడు నేరుగా ఒకరిపై ఒకరు యుద్ధం ప్రకటించుకున్నాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. “మా ఓపిక నశించింది. ఇది ఇకపై మీకూ మాకూ మధ్య బహిరంగ యుద్ధమే” అని ప్రకటించడం అంతర్జాతీయ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
గురువారం రాత్రి అఫ్గాన్ దాడులకు బదులుగా పాక్ వైమానిక దాడులు ప్రారంభించింది. దీనికి ‘ఆపరేషన్ గజబ్ లిల్ హక్గా పేర్కొంది. కాబుల్లో మూడుసార్లు పేలుడు శబ్దాలు వినిపించాయని తాలిబన్ అధికారులు పేర్కొన్నారు. కాబుల్, కాందహార్, పక్తియా ప్రావిన్స్లలో వైమానిక దాడులు జరిగాయని అఫ్గాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా తెలిపారు. అయితే, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని వెల్లడించారు. పాక్పై చేపట్టిన దాడుల్లో 55 మంది ఆ దేశ సైనికులు చనిపోయారని అఫ్గాన్ ప్రకటించింది.
అయితే, ఇస్లామాబాద్ దీన్ని తోసిపుచ్చింది. ఘర్షణల్లో ఇద్దరు పాక్ సైనికులు మరణించారని, మరో ముగ్గురు గాయపడ్డారని పేర్కొంది. ఇస్లామాబాద్ సైనికుల నిర్బంధంపై అఫ్గాన్ చేసిన ప్రకటనను పాక్ ప్రభుత్వ ప్రతినిధి మోషరఫ్ అలీ జైదీ ఖండించారు. అఫ్గాన్ సైనికులే 133 మంది మరణించారని.. 200 మందికి పైగా గాయపడ్డారన్నారు. తొమ్మిది మంది సైనికులను నిర్బంధించినట్లు తెలిపారు. ఇటీవల తమపై జరిగిన వైమానిక దాడులకు ప్రతీకారంగా పాక్పై అఫ్గాన్ విరుచుకుపడింది. ఇది ఇరుదేశాల మధ్య తాజా ఉద్రిక్తతలకు దారితీసింది.


