అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం, గ్లోబల్ డిమాండ్ తగ్గడంతో ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బులియన్ మార్కెట్లో కొంతకాలంగా కొనసాగుతున్న ఒడుదొడుకులు తాజాగా ధరల తగ్గుదలకు దారితీశాయి. పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ సమాచారం ప్రకారం, మంగళవారం ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 తగ్గి రూ.1,53,000కి చేరింది. అదేవిధంగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారంపై రూ.650 తగ్గి 10 గ్రాముల ధర రూ.1,40,250గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,53,150, 22 క్యారెట్ల ధర రూ.1,40,400గా ఉంది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా భారీ పతనాన్ని నమోదు చేశాయి. కిలో వెండిపై ఏకంగా రూ.4 వేల వరకు ధర తగ్గింది. ఈ తగ్గుదలతో హైదరాబాద్, విజయవాడలలో కిలో వెండి ధర రూ.2,65,000కు చేరింది. ఢిల్లీ, బెంగళూరులలో కిలో వెండి రూ.2,60,000 వద్ద అమ్ముడవుతుండగా, చెన్నైలో రూ.2,65,000గా నమోదైంది. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువ ఆధారంగా ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.


