విశాలాంధ్ర-రాప్తాడు : అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని శ్రీ రామేశ్వరస్వామి దేవాలయంలో మూడు రోజులుగా భక్తుల విశేష పూజలందుకున్న శ్రీ కడ్లే గౌరీదేవి శనివారం ఉదయం రాప్తాడు పండమేరు వంకలో నిమజ్జనం చేశారు. గ్రామపెద్దలు, గ్రామ ప్రజలు, వీరశైవ లింగాయత్లు ప్రతిఏటా కార్తీక మాసంలో కడ్లే గౌరమ్మ విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో ప్రతిష్టిస్తారు. మహిళలు, యువతులు, చిన్నారులు శుక్రవారం రాత్రి కడ్లే గౌరమ్మకు సంస్కృతీ, సాంప్రదాయాల మధ్యన కలశాలలో హారతులతో ఊరేగింపుగా వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. శనివారం తెల్లవారుజాము నుంచి మహిళలు, యువతులు, చిన్నారులు చక్ర హారతులు పట్టుకోగా అలంకరణ చేసిన గౌరీదేవిని పూలరథోత్సవంలో విద్యుత్ దీపాలంకరణలో గ్రామ వీధుల్లో మేళతాళాలు, నంది ధ్వజములు, డోలు సన్నాయిలు వాయించుకుంటూ గ్రామవీధుల్లో ఊరేగింపు చేశారు. వీరభద్రస్వామి వేషధారణలతో చేసిన విన్యాసాలు భక్తులను అలరించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.