ట్రంప్ను హెచ్చరించిన జిన్పింగ్
హర్మూజ్ను తెరవాల్సిందే
అమెరికా, చైనా అధ్యక్షుల ఏకాభిప్రాయం
బీజింగ్: తైవాన్పై కన్నేసిన చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్…తైవాన్ విషయంలో తల దూర్చొద్దని ట్రంప్కు హెచ్చరికలు జారీ చేశారు. తైవాన్ విషయంలో అతిగా జోక్యం చేసుకోవద్దన్నారు. అక్కడ తేడాలొస్తే అమెరికా, చైనాల మధ్య యుద్ధాలు తలెత్తే ముప్ప్పుందన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం చైనాకు వచ్చిన ట్రంప్తో బీజింగ్లోని ‘గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల’లో జిన్పింగ్ గురువారం రెండు గంటలపాటు భేటీ అయ్యారు. తైవాన్ విషయం సహా ఇరాన్ యుద్ధం, ఇంధన భద్రత, వాణిజ్యం వంటి అంశాలపై సమాలోచనలు జరిపారు. ఇంధన సరఫరా స్వేచ్ఛగా జరిగేందుకు వీలుగా హర్మూజ్ జలసంధి తెరిచి ఉండాల్సిందేనని ట్రంప్, జిన్పింగ్ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని తీర్మానించుకున్నారు. హర్మూజ్ను తెరిచేందుకు సాయం చేస్తానని జిన్పింగ్ ముందుకొచ్చారని ట్రంప్ ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ తెలిపారు. ఇరాన్కు సైనిక సామగ్రి ఇవ్వబోమనీ ఆయన హామీ ఇచ్చారన్నారు. సెప్టెంబరు 24న శ్వేతసౌధానికి రావాలని జిన్పింగ్ దంపతులను అమెరికా అధ్యక్షుడు ఆహ్వానించారు.
తైవాన్ మాకు కీలకం: జిన్పింగ్
చైనా-అమెరికా సంబంధాల్లో అత్యంత ముఖ్యమైన అంశంగా తైవాన్ను జిన్పింగ్ పేర్కొన్నారు. దాని విషయంలో సరిగా వ్యవహరిస్తే.. ద్వైపాక్షిక బంధం స్థిరత్వాన్ని కలిగి ఉంటుందని స్పష్టం చేశారు. లేకుంటే ఇరు దేశాల మధ్య ఘర్షణలు, సంక్షోభాలు తలెత్తుతాయని హెచ్చరించారు. ట్రంప్-జిన్పింగ్ భేటీ వివరాలను చైనా ప్రభుత్వరంగ వార్తాసంస్థ ‘షిన్హువా’ వెల్లడించింది. ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని విస్తరించుకోవడం, హర్మూజ్ను తెరవడం, అణ్వస్త్రాలను పొందకుండా ఇరాన్ను నిలువరించడం వంటి అంశాలపై ట్రంప్, జిన్పింగ్ చర్చించారని శ్వేతసౌధం ఓ ప్రకటనలో తెలిపింది. హర్మూజ్లో బలగాల మోహరింపు, టోల్ వసూలు ప్రయత్నాలను చైనా వ్యతిరేకిస్తున్నట్లు ట్రంప్తో భేటీలో జిన్పింగ్ స్పష్టం చేశారని పేర్కొంది. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదని ఇరువురు నేతలూ ముక్తకంఠంతో అభిప్రాయపడ్డారని తెలిపింది. తైవాన్ తమ దేశంలో భాగమేనని చైనా వాదిస్తోంది. దాన్ని తిరిగి తమ ప్రధాన భూభాగంలో కలుపుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అమెరికా మాత్రం తైవాన్తో సంబంధాలను కొనసాగిస్తూ… దానికి ఆయుధాలు కూడా సరఫరా చేస్తున్న సంగతి గమనార్హం.
తైవాన్ విషయంలో తలదూర్చొద్దు
- Advertisement -
RELATED ARTICLES


