ఇటీవల పరుగులు పెడుతున్న బంగారం ధరల జోరుకు బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, కేంద్రం దిగుమతి సుంకాలను పెంచడం వంటి కారణాలతో శుక్రవారం దేశీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. కొనుగోలుదారులకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ అందించిన సమాచారం ప్రకారం ఈరోజు (మే 15) ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.2,240 తగ్గి రూ.1,60,090 వద్దకు చేరింది. ఇక, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా రూ.2,050 తగ్గి రూ.1,46,750 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండి ధరపై ఏకంగా రూ.10,000 కోత పడటంతో ప్రస్తుతం రూ.3.05 లక్షల వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,60,090గా ఉండగా, ఢిల్లీలో రూ.1,60,240గా ఉంది. చెన్నైలో మాత్రం కాస్త ఎక్కువగా రూ.1,63,390 వద్ద ట్రేడవుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ కిలో వెండి ధర రూ.3.05 లక్షల వద్దనే కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే దేశవ్యాప్తంగా పసిడి, వెండి ధరల్లో భారీ తగ్గుదల నమోదైంది.


