ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆన్లైన్లో లేదా ఆర్టీసీ కౌంటర్లలో టికెట్ రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులను వారి ఇంటి వద్ద నుంచే బస్టాండ్కు తీసుకెళ్లేందుకు ప్రత్యేక బస్సును అందుబాటులోకి తీసుకురానుంది.ఈ విషయాన్ని ఎన్టీఆర్ జిల్లా ప్రజారవాణాధికారిణి వి. నీలిమ సోమవారం ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఈ సదుపాయం విజయవాడ నగర పరిధిలోని ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆమె వెల్లడించారు. తొలిదశలో విజయవాడ-హైదరాబాద్ మార్గంలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఒకే చోట నుంచి ప్రయాణించే వారు కనీసం ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటే ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
ఎంత దూరమైతే అంత రుసుము
ఇప్పటికే టికెట్లు రిజర్వ్ చేసుకున్న వారితో పాటు రిజర్వేషన్ చేసుకోవాలనుకునే ప్రయాణికులకు కూడా ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు.ఇంటి వద్ద నుంచి బస్టాండ్కు బస్సు సదుపాయం పొందాలనుకునే ప్రయాణికులు తాము ఎక్కాల్సిన ప్రదేశం నుంచి బస్టాండ్ వరకు ఉన్న దూరానికి అనుగుణంగా టికెట్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.అంటే ఇంటి వద్ద నుంచి బస్టాండ్ వరకు ఎంత దూరం ఉంటే ఆ మేరకు అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
నాలుగు గంటల ముందే ఫోన్ చేయాలి
ఈ సదుపాయాన్ని పొందాలనుకునే ప్రయాణికులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య సంబంధిత అధికారులను సంప్రదించాలి.తాము ఎక్కాల్సిన బస్సు బయలుదేరే సమయానికి కనీసం నాలుగు గంటల ముందుగానే 73828 25450, 99592 25450 మొబైల్ నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలని అధికారులు సూచించారు.
హైకోర్టు బస్సు రూటులో మార్పులు
విజయవాడ పీఎన్బీఎస్ నుంచి ఏపీ హైకోర్టుకు వెళ్లే బస్సు రూటులోనూ మార్పులు చేశారు.ఉదయం 9.10 గంటలకు పీఎన్బీఎస్ నుంచి బయలుదేరే బస్సు సీడ్ యాక్సిస్ రోడ్డు, సీఆర్డీఏ మీదుగా ఏపీ హైకోర్టుకు చేరుకునేలా మార్గాన్ని మార్చినట్లు వి. నీలిమ తెలిపారు.
అదనంగా మరో ట్రిప్
ఉదయం 9.25 గంటలకు ఉండవల్లి సెంటర్ నుంచి ఏపీ హైకోర్టుకు మరో అదనపు ట్రిప్ను కూడా సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు.ఈ బస్సు ఉండవల్లి సెంటర్ నుంచి పెనుమాక, మందడం మీదుగా ఏపీ హైకోర్టుకు వెళ్లేలా మార్గాన్ని నిర్ణయించారు. దీంతో హైకోర్టుకు వెళ్లే ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది.


