నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు ముందు దేశంలో మరోసారి వర్షాలు జోరందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ ఏడాది వర్షాకాలం ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక అప్డేట్ ఇచ్చింది.
దేశం నుంచి నైరుతి రుతుపవనాలు అధికారికంగా వెనక్కి వెళ్లే ముందు మరో బలమైన వర్షపు స్పెల్ వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
సెప్టెంబర్ 12 నుంచి 21 మధ్య దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు మళ్లీ పుంజుకునే సూచనలు ఉన్నాయని ఉపగ్రహ చిత్రాలు, వాతావరణ నమూనాలు వెల్లడిస్తున్నాయి.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు..
సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలల పాటు నైరుతి రుతుపవనాల సీజన్ కొనసాగుతుంది. ఈ సీజన్ ముగింపు దశలో కురిసే వర్షాలు ఇప్పుడు అత్యంత కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ రెండో అర్ధభాగంలో నమోదయ్యే వర్షపాతం పలు ప్రాంతాల్లో వ్యవసాయం, నీటి లభ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఏయే ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం?
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహం పంపిన తాజా చిత్రాలను పరిశీలిస్తే దేశ వాయవ్య ప్రాంతంలో మేఘాల సాంద్రత తగ్గినట్లు కనిపిస్తోంది. అయితే తూర్పు, దక్షిణ భారత ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన వర్షపు మేఘాలు చురుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ రెండో అర్ధభాగంలో దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య, తూర్పు భారతదేశంలోని ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనూ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. పశ్చిమ భారతదేశంలో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా.
14 శాతం వర్షపాత లోటు.. ఎల్నినో ప్రభావం ఎంత?
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావం దేశవ్యాప్తంగా ఒకేలా కనిపించలేదు. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు నమోదవగా.. మరికొన్ని ప్రాంతాలు తీవ్ర వర్షపాత లోటును ఎదుర్కొన్నాయి. ఇప్పటివరకు నమోదైన గణాంకాల ప్రకారం దేశంలో సాధారణ వర్షపాతం కంటే 14 శాతం లోటు ఉన్నట్లు సమాచారం. పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ఃఎల్నినోః ప్రభావమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఎల్నినో ప్రభావంతో రుతుపవనాల వ్యవస్థ బలహీనపడటంతో వర్షాలు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా ప్రాంతాలవారీగా భారీ వ్యత్యాసాలు కనిపించాయని వారు పేర్కొంటున్నారు.
రైతులకు కీలక సమయం.. పంటలకు ఉపశమనం లభిస్తుందా?
సెప్టెంబర్లో కురిసే వర్షాలు వ్యవసాయ రంగానికి, ముఖ్యంగా వర్షాధార పంటలకు ఎంతో కీలకం. సుదీర్ఘంగా ఎండలు కొనసాగిన తర్వాత కురిసే వర్షాలతో నేలలో తేమ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. ఇది పంటలకు అవసరమైన తేమను అందించడంలో కొంతవరకు ఉపయోగపడుతుంది. అదే సమయంలో పంటలు కోత దశకు చేరుకుంటున్న సమయంలో వర్షాలు కురిస్తే దిగుబడిపై ప్రభావం పడకుండా ఉండేందుకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. అయితే సెప్టెంబర్ చివరి వారంలో వర్షాలు పూర్తిగా తగ్గిపోతే గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థతో పాటు వ్యవసాయ ఉత్పత్తులపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని అంచనా.
వర్షాల తర్వాత రుతుపవనాల ఉపసంహరణ
సెప్టెంబర్ 21 తర్వాత ఈ వర్షపు స్పెల్ ముగిసిన వెంటనే నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ వేగం పుంజుకునే అవకాశం ఉంది. తొలుత వాయవ్య భారతదేశంలోని రాజస్థాన్, పంజాబ్ ప్రాంతాల నుంచి రుతుపవనాలు వెనక్కి తగ్గడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత క్రమంగా దక్షిణ, తూర్పు దిశగా రుతుపవనాల ఉపసంహరణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాబోయే 10 రోజుల్లో కురిసే వర్షాలు ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో నమోదయ్యే చివరి ప్రధాన వర్షాలుగా భావించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ వర్షపు స్పెల్ కీలకంగా మారనుంది.


