Homeఅంతర్జాతీయంయూకేలో విమాన సేవలకు భారీ అంతరాయం.. వెయ్యికి పైగా విమానాలు రద్దు

యూకేలో విమాన సేవలకు భారీ అంతరాయం.. వెయ్యికి పైగా విమానాలు రద్దు

- Advertisement -

బ్రిటన్‌ గగనతలంలో ఒక్కసారిగా విమాన రాకపోకలు స్తంభించిపోయాయి. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా వెయ్యికి పైగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. మరికొన్ని విమానాలు గంటల తరబడి ఆలస్యమయ్యాయి.
దీంతో వేలాది మంది ప్రయాణికులు విమానాల్లోనే, విమానాశ్రయాల టెర్మినల్స్‌లోనూ గంటల పాటు పడిగాపులు కాశారు.

బ్రిటన్‌ దాటి యూరప్‌పైనా ప్రభావం
విమానాలను రద్దు చేయడం, దారి మళ్లించడం, షెడ్యూళ్లను మార్చడం వంటి పరిణామాలతో బ్రిటన్‌తో పాటు యూరప్‌లోని పలు ప్రాంతాల్లోనూ విమాన సేవలు గందరగోళానికి గురయ్యాయి. బ్రిటన్‌ గగనతల నియంత్రణ సేవలను నిర్వహించే నేషనల్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ సర్వీసెస్‌(చీATS)కు చెందిన ఫ్లైట్‌ డేటా ప్రాసెసింగ్‌ వ్యవస్థలో సాంకేతిక సమస్య రావడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ లోపం ప్రభావం లండన్‌లోని హీత్రూ, గాట్‌విక్‌, స్టాన్‌స్టెడ్‌, సిటీ విమానాశ్రయాలతో పాటు మాంచెస్టర్‌, బర్మింగ్‌హామ్‌,ఎడిన్‌బర్గ్‌ వంటి ప్రధాన ఎయిర్‌పోర్టులపైనా పడింది. పరిస్థితి తీవ్రంగా మారడంతో కొన్ని విమానాలను ఇతర యూరప్‌ విమానాశ్రయాలకు మళ్లించాల్సి వచ్చింది. విమానాలు, సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతాల్లో అందుబాటులో లేకపోవడంతో.. సాంకేతిక సమస్యను పరిష్కరించిన తర్వాత కూడా దాని ప్రభావం వెంటనే తగ్గలేదు.

గంటల తరబడి విమానాల్లోనే..
సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రన్‌వేలపై నిలిచిపోయిన విమానాల్లోనే పలువురు గంటల తరబడి కూర్చోవాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికుల్లో తీవ్ర అసహనం వ్యక్తమైంది. కొన్ని విమానాలను చివరకు రద్దు చేయడంతో ప్రయాణికులు టెర్మినల్స్‌కు చేరుకున్నారు. అక్కడా వారికి సమస్యలు తప్పలేదు. భారీ రద్దీ, బ్యాగేజీకి సంబంధించిన ఇబ్బందులు, సరైన సమాచారం అందకపోవడం వంటి కారణాలతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ 100కు పైగా విమానాలను రద్దు చేయడం లేదా దారి మళ్లించడం జరిగింది. మరోవైపు ర్యాన్ఎయిర్‌ తమ సేవల అంతరాయం వల్ల 65 వేల మందికి పైగా ప్రయాణికులు ప్రభావితమైనట్లు వెల్లడించింది. ఈజీజెట్‌తో పాటు మరికొన్ని విమానయాన సంస్థల సర్వీసులపైనా అంతరాయం కొనసాగింది.

సమస్య పరిష్కరించినా..
సాయంత్రానికి సాంకేతిక లోపాన్ని పరిష్కరించినట్లు చీATS ప్రకటించింది. వ్యవస్థ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోందని తెలిపింది. అంతరాయం కారణంగా నిలిచిపోయిన విమానాల భారీ బ్యాక్‌లాగ్‌ను క్లియర్‌ చేస్తున్నామని వెల్లడించింది. అయితే సాంకేతిక సమస్య పరిష్కారమైన వెంటనే పరిస్థితి పూర్తిగా సాధారణం కాలేదు. విమానాలు, సిబ్బంది వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోవడంతో షెడ్యూళ్లు సరిచేయడానికి సమయం పట్టింది. హీత్రూ విమానాశ్రయంలో ఆ రోజు రాత్రి విమానాల రాకను నిలిపివేశారు. కేవలం బయలుదేరే విమానాలను మాత్రమే నడిపారు.

భారత్‌-యూకే విమానాలపైనా ప్రభావం
ఈ సాంకేతిక వైఫల్యం భారత్‌ నుంచి యూకేకు, యూకే నుంచి భారత్‌కు నడిచే విమాన సర్వీసులనూ ప్రభావితం చేసింది. విమానాలు, సిబ్బంది ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోవడంతో తరువాత నడపాల్సిన సర్వీసుల షెడ్యూళ్లలోనూ మార్పులు చేయాల్సి వచ్చింది. దీంతో భారత్‌-యూకే ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ విమానం పరిస్థితిని సంబంధిత విమానయాన సంస్థతో తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని సూచించారు.

నాట్స్‌పై మళ్లీ విమర్శలు
NATS వ్యవస్థలో ఇలాంటి సాంకేతిక సమస్యలు పునరావృతం అవుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.2023లోనూ ఫ్లైట్‌-ప్లాన్‌ ప్రాసెసింగ్‌లో లోపం తలెత్తడంతో భారీ సంఖ్యలో విమాన సేవలు నిలిచిపోయాయి.ఆ ఘటన కారణంగా విమానయాన సంస్థలు ప్రయాణికులకు పెద్ద మొత్తంలో రీఫండ్‌లు, పరిహారం చెల్లించాల్సి వచ్చింది.తాజాగా మరోసారి అదే తరహాలో సాంకేతికవైఫల్యం చోటుచేసుకోవడంతో బ్రిటన్‌ విమానయాన మౌలిక వసతుల విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.కీలకమైన గగనతల నియంత్రణ వ్యవస్థలో పదేపదే సమస్యలు రావడంపై అధికారులు, ప్రయాణికుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఈ ఘటనపై బ్రిటన్‌ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ పూర్తి నివేదిక కోరింది.అయితే NATS చీఫ్‌ మార్టిన్‌ రోల్ఫ్‌ మాత్రం సాంకేతిక సమస్యకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు