తనను పరారీలో ఉన్న వ్యక్తిఃగా పేర్కొనడంపై ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.తాను ఉద్దేశపూర్వకంగా బ్రిటన్లో ఉండిపోలేదని స్పష్టం చేశారు.ప్రస్తుతం బ్రిటన్ నుంచి బయటకు వెళ్లేందుకు తనకు చట్టపరమైన అనుమతి లేదని తెలిపారు. అందుకే భారత్కు తిరిగి రాలేకపోతున్నానని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
1992 నుంచే బ్రిటన్లో శాశ్వత నివాస హక్కు
1992 నుంచి బ్రిటన్లో శాశ్వత నివాస హక్కుతో ఉంటున్నట్లు మాల్యా వెల్లడించారు.భారత్కు రావాలన్న కోరిక ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో బ్రిటన్ విడిచి వెళ్లే అవకాశం తనకు లేదని చెప్పారు.తన విషయంలో భారత ప్రభుత్వం అనుసరించిన విధానం తీవ్రంగా అన్యాయంగా ఉందని ఆరోపించారు.
కింగ్ఫిషర్ రుణాల కేసుతో న్యాయపరమైన చిక్కులు
కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ రుణాల వ్యవహారంలో విజయ్ మాల్యా చాలాకాలంగా న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు.భారీ నష్టాల్లో కూరుకుపోయిన కింగ్ఫిషర్ బ్యాంకుల రుణాలను చెల్లించలేని పరిస్థితికి చేరుకున్న సమయంలో 2016 మార్చిలో మాల్యా భారత్ నుంచి బ్రిటన్కు వెళ్లారు.బ్యాంకుల కన్సార్టియానికి దాదాపు రూ.9,000 కోట్ల బకాయిలు ఉన్నాయని పేర్కొంటూ ఆయనపై కేసులు నమోదయ్యాయి.అనంతరం 2019లో ముంబై ప్రత్యేక కోర్టు మాల్యాను ఃపరారీలో ఉన్న ఆర్థిక నేరగాడుఃగా ప్రకటించింది.
2017లో అప్పగింతకు కేంద్రం విజ్ఞప్తి
మాల్యాను భారత్కు తీసుకురావడానికి 2017లో కేంద్ర ప్రభుత్వం బ్రిటన్ను అధికారికంగా కోరింది.అదే ఏడాది లండన్లో ఆయన అరెస్టయ్యారు. అనంతరం బెయిల్ మంజూరైనప్పటికీ బ్రిటన్ విడిచి వెళ్లకూడదన్న షరతు విధించారు.భారత్కు అప్పగించాలంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును మాల్యా హైకోర్టులో సవాల్ చేశారు.అయితే అక్కడ కూడా ఆయనకు అనుకూలంగా తీర్పు రాలేదు. బ్రిటన్ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అనుమతి కోరినా అది కూడా లభించలేదు.
అప్పగింతకు మరో గోప్యమైన అంశం ఉందన్న కేంద్రం
బ్రిటన్ న్యాయస్థానాల నిర్ణయాలు మాల్యాకు ప్రతికూలంగా వచ్చినప్పటికీ ఆయన ఇప్పటివరకు భారత్కు తిరిగి రాలేదు.మాల్యాను భారత్కు అప్పగించడంలో మరో గోప్యమైన న్యాయపరమైన అంశం అడ్డంకిగా ఉందని కేంద్ర ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టుకు వెల్లడించింది.
బాంబే హైకోర్టులోనూ ఇదే వాదన
ఇదే సమయంలో బ్రిటన్ నుంచి బయటకు వెళ్లేందుకు తనకు అనుమతి లేదని మాల్యా చెబుతున్నారు.ఇటీవల బాంబే హైకోర్టులో మాల్యా తరఫు న్యాయవాదులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు.భారత్కు ఎప్పుడు తిరిగి వస్తారో చెప్పాలని కోర్టు ప్రశ్నించగా.. బ్రిటన్ కోర్టులు విధించిన ఆంక్షల కారణంగా ఇంగ్లండ్, వేల్స్ నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నామని తెలిపారు.అంతేకాకుండా మాల్యా పాస్పోర్టు కూడా రద్దయిందని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
బకాయిల కంటే ఎక్కువే రికవరీ చేశారన్న మాల్యా తరఫు న్యాయవాదులు
కింగ్ఫిషర్ రుణాలకు సంబంధించిన మరో అంశాన్ని కూడా మాల్యా తరఫు న్యాయవాదులు బాంబే హైకోర్టులో ప్రస్తావించారు.బ్యాంకులకు చెల్లించాల్సిన అసలు బకాయిల కంటే ఇప్పటికే ఎక్కువ మొత్తాన్ని రికవరీ చేశారని వారు వాదించారు.దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్పందనను బాంబే హైకోర్టు కోరింది.అయితే ఈ మొత్తం వ్యవహారం పూర్తిగా ముగిసిపోయిందని కోర్టు ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదు.


