అమెరికాలో ఉద్యోగం చేయాలన్న లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణుల ఆశలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.విదేశీ ఉద్యోగులను అమెరికాకు తీసుకొచ్చే సంస్థలపై భారీగా 100,000 డాలర్ల ఫీజు విధించడం ఐటీ రంగంలో కలకలం రేపుతోంది.
భారత కరెన్సీలో ఇది సుమారు రూ.95 లక్షలకు సమానం.ఇంతటి భారీ వ్యయాన్ని భరించలేకపోతున్న కంపెనీలు.. ఏటా జరిగే H-1B వీసా లాటరీకి దరఖాస్తు చేయడంలో వెనకడుగు వేస్తున్నాయి.అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల్లోనూ ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రధాన ఐటీ సంస్థలు తమH-1B వీసా లాటరీ దరఖాస్తులను గతేడాదితో పోలిస్తే 85శాతం నుంచి 100 శాతం వరకు తగ్గించాయి.
వీసా దరఖాస్తుల్లో భారీ కోత.. టీసీఎస్,ఇన్ఫోసిస్ వెనకడుగు
దీంతో అమెరికా మార్కెట్లో భారతీయ ఐటీ సేవలు, కన్సల్టింగ్ సంస్థలకు ఎదురవుతున్న సవాళ్లు మరింత స్పష్టమవుతున్నాయి.కొత్త ఫీజుల కారణంగా భారతీయ టెక్ కంపెనీలు H-1B వీసా లాటరీలో తమ భాగస్వామ్యాన్ని భారీగా తగ్గించాయి.
ఇన్ఫోసిస్: గతేడాదితో పోలిస్తే ఈసారి ఇన్ఫోసిస్ హెచ్-1బీ వీసా లాటరీ ఎంట్రీలను 8,100కుపైగా తగ్గించింది. ఇది ఏకంగా 91 శాతం కోత కావడం గమనార్హం.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ((TCS):): దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ అయిన టీసీఎస్ కూడా H-1B వీసా ఎంట్రీలను 5,600కుపైగా తగ్గించింది. గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు 95 శాతం తగ్గుదల.
కాగ్నిజెంట్: గత ఏడాది 3,752 హెచ్-1బీ దరఖాస్తులు సమర్పించిన కాగ్నిజెంట్.. ఈసారి మాత్రం లాటరీలో పాల్గొనకపోవడం గమనార్హం.
మరిన్ని ఆంక్షలకు సిద్ధమవుతున్న ట్రంప్ ప్రభుత్వం
ఐబీఎం: ఐబీఎం సైతం హెచ్-1బీ వీసా దరఖాస్తుల్లో 2,700కుపైగా కోత పెట్టింది. ఈ పరిణామాలు అమెరికా ఐటీ మార్కెట్లో భారతీయ సంస్థలు ఎదుర్కొంటున్న ఒత్తిడిని తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ ఉద్యోగులను అమెరికాకు పంపించేందుకు అయ్యే ఖర్చు పెరగడంతో కంపెనీలు తమ నియామక వ్యూహాలను మార్చుకుంటున్నాయి.ఇప్పటికే 100,000 డాలర్ల అంటే సుమారు రూ.95 లక్షల ఫీజు నిర్ణయం ఐటీ కంపెనీలకు భారంగా మారగా.. ట్రంప్ ప్రభుత్వం మరో ప్రతిపాదనను కూడా ముందుకు తెచ్చింది. ప్రతి H-1B ఉద్యోగిపై 103,265 డాలర్ల వరకు అదనపు రుసుము వసూలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది.
గతంలో ఈ ఫీజు నుంచి మినహాయింపు పొందిన అమెరికా విశ్వవిద్యాలయాల నుంచి చదువుకున్న విదేశీ గ్రాడ్యుయేట్లకు కూడా కొత్త రుసుమును వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది.వివిధ ఫెడరల్ ఏజెన్సీలకు ఇమ్మిగ్రేషన్ సంబంధితంగా అవుతున్న సుమారు 8.7 బిలియన్ డాలర్ల ఖర్చులను భర్తీ చేయడమే ఈ ఫీజుల ప్రతిపాదన వెనక ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది.అయితే ఈ ప్రతిపాదనపై ఆర్థికవేత్తలు, ఇమ్మిగ్రేషన్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.భారీ ఫీజుల కారణంగా కంపెనీలు కొత్తగా విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి ఆసక్తి చూపకపోవచ్చని ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రోగ్రెస్ అధ్యయనం పేర్కొంది.
ఐటీ కంపెనీలపై ఆడిట్లు.. పెరిగిన నిఘా
ప్రతిపాదిత ఫీజు అమల్లోకి వస్తే H-1B వీసా లపై డిమాండ్ 63శాతం నుంచి 91శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా.అదే జరిగితే ప్రతి ఏడాది అందుబాటులో ఉండే 85,000 H-1B వీసాల కోటా కూడా పూర్తిగా వినియోగం కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.మరోవైపు విదేశీ కార్మికులను అమెరికాలో నియమించుకునే సంస్థలపై అక్కడి కార్మిక శాఖ పర్యవేక్షణను మరింత పెంచింది.H-1B, పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్((PERM))లో అక్రమాలు జరుగుతున్నాయా అనే అంశంపై అకౌంటింగ్ ఆడిట్ నిర్వహిస్తోంది.మోసపూరిత వ్యవహారాలకు సంబంధించిన ఆరోపణలు రావడంతో కాగ్నిజెంట్కు చెందిన PERM దరఖాస్తుల ప్రక్రియను కార్మిక శాఖ ఇటీవల నిలిపివేసింది.దీంతో విదేశీ ఉద్యోగుల నియామకాలు,వీసా స్పాన్సర్షిప్ల విషయంలో ఐటీ కంపెనీలపై ఒత్తిడి మరింత పెరిగింది.
సెప్టెంబర్ 24తో ప్రజాభిప్రాయాల గడువు
ప్రస్తుతం ప్రతిపాదించిన 103,265 డాలర్ల H-1B ఫీజుపై ప్రజల అభిప్రాయాలను అమెరికా ప్రభుత్వం సేకరిస్తోంది.ఈ ప్రక్రియకు సెప్టెంబర్ 24 వరకు గడువు ఉంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. ఇప్పటికే తీవ్ర పోటీ ఉన్న H-1B వీసా వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.విదేశీ నిపుణులను అమెరికాకు తీసుకురావడానికి అవసరమైన స్పాన్సర్షిప్ ఖర్చులు కంపెనీలకు ఆర్థికంగా భారంగా మారవచ్చు.దీంతో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం తమకు గిట్టుబాటు కాదనే నిర్ణయానికి సంస్థలు వచ్చే పరిస్థితి ఏర్పడొచ్చు.


