ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై 6 వారాల పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా పేరిట కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వర్మ సినిమా తీశారంటూ మంగళగిరికి చెందిన బండారు వంశీకృష్ణ ఫిర్యాదుతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిందే. దాంతో, ఏపీ సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ వర్మ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
వర్మ పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. తనపై పెట్టిన కేసు రాజకీయ దురుద్దేశంతోనే నమోదైందని, తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని వర్మ తన పిటిషన్ లో పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చాకే 2019లో తమ చిత్రాన్ని విడుదల చేశామని, కానీ 2024లో దీనిపై కేసు నమోదు చేయడం వెనుక దురుద్దేశాలు ఉన్నాయని తెలిపారు.
అందుకే ఈ కేసు ఆధారంగా సీఐడీ తీసుకోబోయే తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని వర్మ ఏపీ హైకోర్టును కోరారు. క్వాష్ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు… వర్మకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.