Wednesday, March 12, 2025
Homeరాజకీయ కక్ష సాధింపులకు దూరం

రాజకీయ కక్ష సాధింపులకు దూరం

. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవ్వరినీ ఉపేక్షించం
. ఈగల్‌ వ్యవస్థతో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం
. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాజకీయ కక్ష సాధింపులకు తాను దూరమని, అదే సమయంలో శాంతి, భద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం ఎవ్వరినీ ఉపేక్షించబోనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆడబిడ్డల జోలికొస్తే తాటతీస్తామని, అందుకోసమే వారికి రక్షణ కవచంగా శక్తి యాప్‌ తెచ్చామని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై శాసనసభలో ముఖ్యమంత్రి మంగళవారం ప్రసంగించారు. ప్రజలు భయం లేకుండా సంతోషంగా ఉండాలంటే శాంతి భద్రతలు చాలా ముఖ్యమని చంద్రబాబు అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు తలెత్తాయని, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కరువైందని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో డ్రగ్స్‌, గంజాయి వాడకం విపరీతంగా పెరిగింది. బాధ్యత గల ప్రతిపక్షంగా దీనిపై తెలుగుదేశం పార్టీ ఆందోళన చేస్తే తిరిగి తమ కార్యాలయంపైనే దాడులు చేశారు. ఏ రాజకీయ పార్టీకైనా పార్టీ కార్యాలయమంటే దేవాలయం. గతంలో ఎక్కడా పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగిన ఘటనలు తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదు. గత పాలకులు కనీసం గంజాయి, డ్రగ్స్‌పై సమీక్ష చేయలేదు. అసెంబ్లీలో చర్చించిన పాపాన పోలేదు. మత్తు పదార్ధాలకు అలవాటు పడిన యువతలో మార్పు అంత తేలిగ్గా రాదు. వ్యవస్థీకృతంగా మారిన గంజాయిసాగు, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్‌ వ్యవస్థను తీసుకొచ్చామని చంద్రబాబు వెల్లడిరచారు.
సోషల్‌ మీడియాలో పిచ్చి రాతలు రాస్తే అంతే సంగతులు
గత పాలకులు రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారారని చంద్రబాబు విమర్శించారు. సోషల్‌ మీడియా ముసుగులో రోత పుట్టించే రాతలు రాశారు. మహిళలపై వ్యక్తిగత దూషణలు చేశారు. ఆడబిడ్డలు తలెత్తుకొని తిరగలేని విధంగా పోస్టులు పెట్టారు. అసెంబ్లీ లోపల, బయటా బూతులతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. వాటన్నింటికీ చెక్‌ పెట్టాం. అసెంబ్లీలో బూతులకు తావులేదు. అర్ధవంతమైన చర్చ జరుగుతోందని ముఖ్యమంత్రి చెప్పారు. భూ కబ్జాల నిషేధానికి కొత్త చట్టం తీసుకొస్తున్నామన్నారు. గత పాలకులు చేసిన భూ మాఫియా అంతా ఇంతా కాదు. 22 ఏ ఉపయోగించి భూ దందాలు చేశారు. రికార్డులు తారుమారు చేశారు. ప్రభుత్వ, పేదల, అటవీ భూములు కొట్టేశారు. అందుకే కొత్త చట్టం తెస్తున్నాం. భూ కబ్జాలకు పాల్పడితే కొత్త చట్టం ద్వారా కఠినంగా శిక్షిస్తాం. ఇకపై ఎవరైనా భూ కబ్జా అనాలంటే భయపడాలి. నేరాలు చేసి… సాక్ష్యాలు తారుమారు చేసి తప్పించుకునే వారికి కాలం చెల్లింది. రాత్రి సమయంలో డ్రోన్‌ పెట్రోలింగ్‌ చేస్తాం. సీసీ టీవీ కెమెరాలు పెడుతున్నాం. 26 సైబర్‌ సెక్యూరిటీ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. నేరస్థులను వెంటనే పట్టుకుంటామని చంద్రబాబు చెప్పారు.
రాజకీయ ముసుగులో నేరాలు-ఘోరాలు
సంచలనం కలిగించిన వివేకానంద హత్య ఉదంతం తలుచుకుంటే ఆందోళన కలుగుతోందని చంద్రబాబు అన్నారు. ఆ కేసుకు సంబంధించి ఆరుగురు సాక్షులు చనిపోవడంపై ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2019లో వివేకా హత్య జరిగింది. మొదట వివేకా గుండెపోటుతో చనిపోయినట్టు వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చింది. ఎన్నికల హడావుడిలో తాను కూడా అదే నిజమనుకున్నాను. నేరస్థులు ఏ విధంగా ట్రాప్‌లో వేస్తారో ఇదో ఉదాహరణ. మధ్యాహ్నానికి పోస్టుమార్టం చేయాలని ఆయన కూతురు సునీత అడిగారు. ఆవిడ పోస్టుమార్టం అడగకపోతే నిజం సమాధయ్యేది.
అప్పటివరకూ గుండెపోటు అని ప్రచారం చేసిన టీవీ చానల్‌… పోస్టుమార్టం తర్వాత మాట మార్చింది. నారాసుర రక్త చరిత్ర అని తనపై విష ప్రచారం చేశారు. ఇలాంటి అరాచకాలతో రాజకీయాలు చేశారు. తన 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎక్కడా హత్యా రాజకీయాల మరక అంటకుండా ఉన్నాను. హత్యారాజకీయాలు చేసిన వారికి ప్రజాక్షేత్రంలో శిక్ష పడేలా చేశాను. రాజకీయ ముసుగులో నేరాలు చేసి తప్పించుకుంటానంటే ఈ ప్రభుత్వంలో సాగనివ్వను. ప్రజలకు భద్రత కల్పించడం మన బాధ్యత అని సీఎం స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు