త్వరలోనే అర్హత ఉన్నజర్నలిస్ట్ లందరికీ ఇళ్ల స్థలాలిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ప్రస్తుతం జర్నలిస్టుల హౌసింగ్పై సీఎం చంద్రబాబు సీరియస్గా దృష్టి పెట్టారని తెలిపారు. ఈ విషయంపై కోర్ట్ల డైరెక్షన్ కూడా ఉందని గుర్తుచేశారు. అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని న్యాయం చేస్తామని అన్నారు. జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సభ్యులు కొణతాల రామకృష్ణ, కాల్వ శ్రీనివాసులు సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ.. గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హడావుడి చేసిందని విమర్శించారు. ఒక జీఓ ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు.
రెండు లక్షలకు పైగా భూ వివాదాలు ..
రెవెన్యూ సమస్యలు, భూ కబ్జాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు కూడా అనగాని సమాధానం ఇస్తూ, ఏఏ ప్రాంతాల్లో భూముల సర్వే జరుగుతుందో వివరించారు. భూ హక్కులు ఉన్న యజమానికి న్యాయం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు ఎక్కువగానే ఉన్నాయని తెలిపారు. 2లక్షలకు పైగా ఆర్జీలు భూ వివాదాలపైనే వచ్చాయని అన్నారు. సమగ్ర భూ సర్వే జరుగుతుందని తెలిపారు. గత వైసీపీప్రభుత్వం భూ సర్వేను అవినీతి మాయంగా మార్చిందని మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వం భూ సర్వే పేరుతో మంచి నిర్ణయం తీసుకుందని మంత్రి చెప్పారు.