పాకిస్థాన్ జైళ్లలోని తమ నాయకులను విడిపించుకోవడానికి బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలును హైజాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ హైజాక్ తో పాకిస్థాన్ ఆర్మీ స్పందించి స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. మిలిటెంట్ల చెరలో ఉన్న ప్రయాణికులను విడిపించేందుకు బలగాలను రంగంలోకి దింపింది. దాదాపు రెండు రోజుల పాటు జరిగిన రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందని, 33 మంది మిలిటెంట్లను మట్టుబెట్టామని ప్రకటించింది. రైలులోని 21 మంది ప్రయాణికులతో పాటు నలుగురు సైనికులు చనిపోయారని పేర్కొంది. మిగతా ప్రయాణికులను క్షేమంగా తీసుకొచ్చామని ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే, ఈ ప్రకటనను బీఎల్ఏ ఖండించింది. ట్రైన్ హైజాక్ తర్వాత పాక్ ప్రభుత్వానికి 48 గంటల డెడ్ లైన్ విధించామని, ఆలోగా పాక్ జైళ్లలోని తమ వారిని విడుదల చేయకపోతే బందీలను చంపేస్తామని హెచ్చరించామని గుర్తుచేసింది. ప్రభుత్వం స్పందించకపోవడంతో డెడ్ లైన్ ముగియగానే తమ బందీలుగా ఉన్న 214 మంది పాక్ సైనికులను చంపేశామని వెల్లడించింది. పట్టాలను పేల్చివేసి జాఫర్ ఎక్స్ ప్రెస్ ను తమ కంట్రోల్ లోకి తీసుకున్నామని వివరించింది. ట్రైన్ లోని ప్రయాణికుల్లో పాక్ సోల్జర్లు కూడా ఉన్నారని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నామని, హైజాక్ చేసిన చోటునుంచి వారిని దూరంగా తరలించామని పేర్కొంది. తమ హెచ్చరికలను పాక్ ప్రభుత్వం లెక్కచేయకపోవడంతో గత్యంతరం లేక వారందరినీ మట్టుబెట్టామని బీఎల్ఏ ప్రతినిధి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.
ట్రైన్ హైజాక్ ఘటనలో 214 మంది సైనికులను చంపేశామన్న మిలిటెంట్లు
RELATED ARTICLES