Homeతెలంగాణబెట్టింగ్ యాప్స్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన నటి మంచు లక్ష్మి

బెట్టింగ్ యాప్స్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన నటి మంచు లక్ష్మి

- Advertisement -

అక్రమ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా నటి, నిర్మాత మంచు లక్ష్మీ ప్రసన్న బుధవారం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఉదయం సుమారు 10:30 గంటలకు ఆమె బషీర్‌బాగ్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయానికి చేరుకున్నారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు గాను కుదుర్చుకున్న ఒప్పందాలు, అందుకు ప్రతిఫలంగా అందుకున్న పారితోషికం, ఇతర ఆర్థిక లావాదేవీల గురించి ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి మంచు లక్ష్మి నుంచి అధికారులు వాంగ్మూలాన్ని నమోదు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ నటులు ప్రకాశ్ రాజ్ (జులై 30), విజయ్ దేవరకొండ (ఆగస్టు 6), రానా దగ్గుబాటి (ఆగస్టు 11) ఈడీ అధికారుల ఎదుట హాజరై తమ వివరణ ఇచ్చారు. వారిని సైతం అధికారులు సుమారు 4 నుంచి 5 గంటల పాటు విచారించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదైన ఐదు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ ఈ కేసులో దర్యాప్తు చేస్తోంది. పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్-1867ను ఉల్లంఘించి, అక్రమ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించారన్న ఆరోపణలతో సుమారు 29 మంది నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసింది. గతంలో విచారణకు హాజరైనప్పుడు, తాము కేవలం చట్టబద్ధంగా అనుమతి పొందిన ఆన్‌లైన్ స్కిల్-బేస్డ్ గేమ్‌లను మాత్రమే ప్రమోట్ చేశామని రానా, విజయ్ దేవరకొండ చెప్పినట్లు తెలిసింది. మరోవైపు, తాను ఒక గేమింగ్ యాప్‌నకు ప్రచారం చేసినప్పటికీ, మనస్సాక్షి అంగీకరించక ఎలాంటి పారితోషికం తీసుకోలేదని ప్రకాశ్ రాజ్ ఈడీకి వివరించారు. ఈ కేసులో మరికొంత మంది సెలబ్రిటీలను కూడా ఈడీ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు