పెట్రోల్ బంకుల్లో ఇంధనం అమ్మకాలపై యూపీఐ ద్వారా చేసే చెల్లింపులకు వర్తించే మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని పెట్రోల్ డీలర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ అంశంపై ఃఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ (ఏఐపీడీఏ) ప్రతినిధులు గురువారం కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో సమావేశమై చర్చలు జరిపారు.కొత్త యూపీఐ నిబంధనల ప్రకారం, పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లలో రూ.2,000 దాటిన ప్రతి లావాదేవీపై రూ.5 ఎండీఆర్ ఛార్జీ విధిస్తున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో జరిగే మొత్తం కొనుగోళ్లలో సుమారు 30 నుంచి 40 శాతం లావాదేవీలు ఈ పరిధిలోకి వస్తాయని డీలర్లు చెబుతున్నారు. పెట్రోల్ అమ్మకాలు నిర్దేశిత కమీషన్లపై ఆధారపడి జరుగుతాయని, ఈ అదనపు ఎండీఆర్ ఛార్జీల భారం తమ మార్జిన్లను దెబ్బతీస్తుందని డీలర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.ఈ సమావేశంలో మంత్రిత్వ శాఖ అధికారులు ఎండీఆర్ విధింపు వెనుక ఉన్న కారణాలను వివరించారు. దేశంలో యూపీఐ డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, విస్తరణకు ఈ ఛార్జీలు అవసరమని వారు తెలిపారు. మరోవైపు, దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంలో తాము ముందు వరుసలో ఉన్నామని, ప్రభుత్వంతో కలిసి పనిచేశామని ఏఐపీడీఏ గుర్తుచేసింది.ఎండీఆర్ అనేది ప్రభుత్వం గానీ, ఎన్పీసీఐ గానీ వసూలు చేసే పన్ను కాదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలోనే స్పష్టం చేసింది. యూపీఐ వ్యవస్థ నిర్వహణ, విస్తరణకు సహకరించేందుకు ఈ మొత్తాన్ని బ్యాంకులకు, పేమెంట్ అప్లికేషన్ ప్రొవైడర్లకు పంచుతారని తెలిపింది. ఇంధనం, రైల్వేలు, టెలికాం, బీమా, వ్యవసాయం వంటి తక్కువ మార్జిన్లు ఉండే కీలక రంగాల్లో రూ.2,000 దాటిన లావాదేవీలకు ఈ రూ.5 ఫ్లాట్ ఛార్జీని వర్తింపజేస్తున్నారు.ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తామని, వినియోగదారులు, డీలర్లు, యూపీఐ భాగస్వాములు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామని ఏఐపీడీఏ ఒక ప్రకటనలో పేర్కొంది.


