ఎర్రజెండాలతో కదం తొక్కిన కామ్రేడ్లు
అట్టహాసంగా ప్రారంభమైన సిపిఐ జిల్లా 26వ మహా సభలు
సభలో తమ వాణిని ఘనంగా వినిపించిన అగ్రనేతలు
మోదీ, చంద్రబాబు అసమర్థత పాలనను దుయ్యపట్టిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ
విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తూర్పు గోదావరి జిల్లా 26వ మహా సభలు రాజమహేంద్రవరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దీంతో నగరమంతా సూర్యుడు ఎర్రని దుప్పటి కప్పేశాడా అన్న చందంగా నగరంలోని ప్రధాన కూడళ్ళన్నీ ఎరుపుమయంగా మారాయి. దీనికి తోడు సిపిఐ జెండాలు చేత బూనిన కార్యకర్తలంతా యుద్ధానికి వెళ్ళే వీర సైనికుల్లా దర్శనమిచ్చారు. నగరంలోని అనేక ప్రాంతాలు సిపిఐ జెండాలు, తోరణాలతో నిండి నగరమంతా సామాన్య ప్రజల సంఘటిత శక్తికి నిదర్శనంగా దర్శనమిచ్చింది. ఈ మహా సభల సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపాక మధు ఆధ్వర్యంలో ప్రజా నాట్యమండలి కళాకారులతో నృత్య ప్రదర్శనలు, జానపద గేయాలతో వేలాది మంది కార్యకర్తలతో స్థానిక చర్చి గేటు నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శన అగ్ర భాగాన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి జె. వి. సత్యనారాయణ మూర్తి, జాతీయ కార్య వర్గ సభ్యురాలు అక్కినేని వనజ, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్ర నాథ్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్సులు కొండ్రపు రాంబాబు, రేఖా భాస్కర్ రావు, కాకినాడ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, కోనసీమ కార్యదర్శి దేవా రాజేంద్ర ప్రసాద్, ఏఐటియుసి జాతీయ సమితి సభ్యులు తోకల ప్రసాద్, సిపిఐ నగర కార్యదర్శి వి. కొండల రావు, సహాయ కార్యదర్శి సప్పా రమణ, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి. లావణ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్సులు చింతలపూడి సునీల్, పి. త్రిమూర్తులు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతి రాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పంతం నాగేశ్వర రావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తోట లక్ష్మణ్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రెడ్డి రమణ, పేపర్ మిల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు జి. ఏ. రామారావు, జెట్ల సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి నల్లా రామారావు, ప్రజా నాట్య మండలి కళాకారులు, డప్పుల బృందం తో ప్రదర్శన మారు మ్రోగింది. ఈ ప్రదర్శన సుబ్రహ్మణ్యం మైదానం లోని చిట్టూరి ప్రభాకర్ చౌదరి వేదిక కు చేరుకుంది. వేలాది మంది కార్మికులు, కష్ట జీవులు ఎర్రదుస్తులు, జెండాలు, ప్లేకార్డులు చేతబూని కామ్రేడ్లు ముందుకు వస్తుండగా రోడ్లన్నీ ఎర్ర జెండాలతో మెరిసాయి. 26వ జిల్లా మహా సభ సందర్బంగా మహిళలు 26జెండాలు పట్టుకుని ప్రదర్శన లో అగ్ర భాగాన నిలిచారు. ఈ ప్రదర్శన లో ఇద్దరు చిన్నారులు సైతం ఎర్ర జెండాలు పట్టుకుని కదులుతూండడం చూపరులను ఆకట్టుకుంది.


