Tuesday, June 3, 2025
Homeజాతీయంఢిల్లీలో విమానానికి తప్పిన ముప్పు.. ల్యాండింగ్‌కు ముందు తీవ్ర కుదుపులు, ప్రయాణికుల ఆర్తనాదాలు..

ఢిల్లీలో విమానానికి తప్పిన ముప్పు.. ల్యాండింగ్‌కు ముందు తీవ్ర కుదుపులు, ప్రయాణికుల ఆర్తనాదాలు..

దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలో, ఇండిగోకు చెందిన ఓ విమానం ల్యాండింగ్ సమయంలో తీవ్రమైన కుదుపులకు లోనవడంతో పైలట్ ల్యాండింగ్‌ను రద్దు చేశాడు. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రాయ్‌పూర్ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న ఇండిగో విమానం 6ఈ 6313 ల్యాండింగ్‌కు కొన్ని నిమిషాల ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం నేలను తాకే సమయంలో వాతావరణం ఒక్కసారిగా ప్రతికూలంగా మారింది. గాలి వేగం గంటకు 80 కిలోమీటర్లకు చేరడంతో విమానం తీవ్రంగా కుదుపులకు లోనైంది. దీంతో అప్రమత్తమైన పైలట్ ల్యాండింగ్ సురక్షితం కాదని భావించి, విమానాన్ని తిరిగి గాల్లోకి తీసుకెళ్లాడు. ఆ సమయంలో విమానం లోపల ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. కిటికీ నుంచి చూస్తే బయట ఏమీ కనిపించనంతగా వాతావరణం మారిపోయింది.

సాయంత్రం 5:05 గంటలకు ల్యాండ్ కావాల్సిన విమానం కొంతసేపు గాల్లోనే చక్కర్లు కొట్టిన అనంతరం 5:43 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు ఓ హెచ్చరిక జారీ చేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా విమాన సర్వీసులపై ప్రభావం పడే అవకాశం ఉందని సూచించారు.

ఢిల్లీలో వాతావరణ బీభత్సం
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులు వీచాయి. ఆగ్నేయ దిశగా కదులుతున్న మేఘాల సమూహం వల్లే ఈ వాతావరణ మార్పులు సంభవించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. దేశ రాజధాని దక్షిణ ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, కొన్నిచోట్ల గంటకు 50 కిలోమీటర్ల వేగాన్ని కూడా అందుకున్నాయని పేర్కొంది. విమానాశ్రయం ఉన్న పాలం ప్రాంతంలో సాయంత్రం 4:30 గంటల సమయంలో గాలి వేగం గంటకు 65 కిలోమీటర్లుగా నమోదైంది. ప్రగతి మైదాన్‌లో గాలి వేగం గంటకు 76 కిలోమీటర్లకు చేరింది.

వివిధ వాతావరణ వ్యవస్థల కలయిక వల్లే ఈ ఆకస్మిక మార్పులు సంభవించాయని వాతావరణ శాఖ వివరించింది. ఉత్తర పాకిస్థాన్‌పై మధ్య ట్రోపోస్పియర్‌ వాతావరణంలో ఏర్పడిన పశ్చిమ అలజడి, హర్యానాపై దిగువ స్థాయిలో ఏర్పడిన మరో తుఫాను తరహా వాయు ప్రసరణ, అరేబియా సముద్రం నుంచి నిరంతరంగా తేమ వంటి అంశాలు ఈ తుఫాను వాతావరణానికి కారణమయ్యాయని ఐఎండీ అధికారులు తెలిపారు. ఢిల్లీలో నేడు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు