కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా కళ్లెం పడింది. శనివారం బులియన్ మార్కెట్లో పసిడి, వెండి రేట్లు భారీగా పతనమయ్యాయి. ముఖ్యంగా ఇటీవల రికార్డులు సృష్టిస్తూ సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిన వెండి ధర, అనూహ్యంగా ఒక్కరోజే కిలోపై ఏకంగా రూ. 13,000 తగ్గడం గమనార్హం. ఈ పరిణామంతో పండగ సీజన్లో కొనుగోళ్లు చేయాలనుకుంటున్న వారికి పెద్ద ఊరట లభించింది.
హైదరాబాద్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఇలా..
హైదరాబాద్ మార్కెట్లో శనివారం నాటి ధరలను పరిశీలిస్తే, కిలో వెండి ధర రూ. 13,000 పతనమై రూ. 1,90,000 వద్ద స్థిరపడింది. శుక్రవారం ఈ ధర రూ. 2,03,000గా ఉంది. ఇక, బంగారం ధరలు కూడా వెండి బాటలోనే నడిచాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములపై రూ. 1,910 తగ్గి రూ. 1,30,860కి చేరింది. అదేవిధంగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం తులంపై రూ. 1,750 తగ్గి రూ. 1,19,950కి దిగొచ్చింది.
ధరల పతనానికి కారణాలివే..
ఈ ఆకస్మిక ధరల పతనానికి అంతర్జాతీయ పరిణామాలు, మదుపరుల లాభాల స్వీకరణ ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. చైనాపై విధించిన దిగుమతి సుంకాలు తాత్కాలికమేనని, త్వరలో ఆ దేశ అధ్యక్షుడు షి జిన్పింగ్తో చర్చించి ఒక గొప్ప ఒప్పందం కుదుర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి తొలగిపోయి, సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం, వెండిపై డిమాండ్ తగ్గింది.
పెద్ద ఎత్తున అమ్మకాలు జరపడంతో మార్కెట్లో ఒక్కసారిగా సప్లై పెరిగి ధరలు కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా స్పాట్ గోల్డ్ ఔన్సుపై 100 డాలర్లకు పైగా తగ్గగా, వెండి ధర దాదాపు 3 డాలర్ల వరకు పతనమైంది. రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


