భారీ నష్టాల కారణంగా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మూతపడిన విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోయానని ఎయిర్ లైన్స్ మాజీ యజమాని విజయ్ మాల్యా పేర్కొన్నారు. ఇటీవల ఓ యూట్యూబర్ కు ఇచ్చిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో మాల్యా మాట్లాడుతూ.. కింగ్ ఫిషర్ ఉద్యోగులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఉద్యోగులకు జరిగినదానికి తాను చింతిస్తున్నానని, వారికి క్షమాపణలు చెప్పడం తప్ప తాను చేయగలిగినది ఏమీ లేదని తెలిపారు. తన సంపద మొత్తం కోర్టు వివాదంలో చిక్కుకుందని గుర్తుచేస్తూ ఉద్యోగులకు జీతాలు అందించేందుకు తన శాయశక్తులా కృషి చేశానని మాల్యా వివరించారు. కోర్టు వివాదంలో చిక్కుకున్న సొమ్ములో నుంచి ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని బ్యాంకులకు, కర్ణాటక హైకోర్టుకు విజ్ఞప్తి చేశానని గుర్తుచేశారు.
తన అప్పుల కన్నా సీజ్ చేసిన ఆస్తుల విలువే ఎక్కువగా ఉందని, అయినప్పటికీ కోర్టు తన విజ్ఞప్తిని తోసిపుచ్చిందని ఆరోపించారు. దీంతో జీతాలు అందక ఇబ్బందులపాలైన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఉద్యోగులను ఆదుకోలేకపోయానని విజయ్ మాల్యా వివరించారు. ఈ విషయంలో తాను నిస్సహాయుడినని, తనను క్షమించాలని తన మాజీ సిబ్బందికి మాల్యా వరుసగా పదకొండవ ఏడాది కూడా క్షమాపణలు చెప్పారు.