విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : భూసారం పెంచుకొనుటకు పచ్చిరొట్ట ఎరువులతో సేంద్రియ కర్భనం పెంచుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి రైతులకు సూచించారు. బుధవారం మండల పరిధిలోని హనుమాపురం గ్రామంలో మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ ఆధ్వర్యంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు చిరుధాన్యాలను సాగు చేసుకోవాలని ఐఐఎంఆర్ శాస్త్రవేత్త సంగప్ప సూచించారు. ప్రత్తి విత్తనాలను విత్తుకునేటప్పుడు విత్తన శుద్ధి చేసుకోవాలని, ప్రత్తిలో ఎరువుల యాజమాన్యం, కలుపు యాజమాన్యం, చీడపీడల యాజమాన్యం, అధిక సాంద్రత పద్దతులో విత్తుకోవడం వలన కలిగే ప్రయోజనాలను కేవికే సమన్వయ కర్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి రైతులకు సూచించారు. రైతులు వ్యవసాయంలో ఆధునిక సాంకేతికను వాడుకొని ఖర్చు తగ్గించుకొని అధిక లాభాలు పొందాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త కిషోర్ కుమార్ అన్నారు. వివిధ రకాల పంటల్లో సరైన మోతాదులో సూచించిన మేరకే ఎరువులు, పురుగు మందులను వాడుకోవాలని మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ తెలిపారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడానికి మేలైన యాజమాన్య పద్దతులపై ఆత్మ బీటీఎం మారుతి యశ్వంత్ వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నిరంజన్ రెడ్డి, సహాయ వ్యవసాయ సంచాలకులు ఖాద్రి, ఇఫ్కో అధికారి మహేష్, గ్రామ వ్యవసాయ సహాయకులు రాహుల్, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.