చర్చించాల్సిందేనని డిమాండ్
న్యూదిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి ఉభయసభల్లో ఎస్ఐఆర్పై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రోజులు గడుస్తున్నప్పటికీ ఎస్ఐఆర్పై చర్చించడానికి కేంద్రప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ విషయంపై ప్రతిపక్ష ఎంపీలు పట్టినపట్టు వీడడం లేదు. గురువారం కూడా ప్రతిపక్ష ఎంపీలు ఓటర్ల సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. బీహార్లో ఓటర్ల జాబితాను సవరించడాన్ని ఇండియా ఐక్యసంఘటన ఎంపీలు వ్యతిరేకిస్తూ పార్లమెంటు వెలుపల నిరసన తెలిపారు. గతంలో ఉన్న ఓటర్ల జాబితాను సవరించి… కొత్త ముసాయిదా ఓటర్ల జాబితాను తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసింది.
ఈ ముసాయిదా జాబితాలో లక్షలాదిమంది ఓట్లు గల్లంతయ్యాయని ఎంపీలు మండిపడ్డారు. అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వలస కూలీలను అరెస్టు చేయడంపై ప్రతిపక్ష ఎంపీలు మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ… ఈ విషయంలో తన ముఖ్యమంత్రులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా జరిగిన ఈ ఆందోళనలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ ఛైర్పర్సన్ సోనియాగాంధీతోపాటు ఇండియా ఐక్యసంఘటన ఎంపీలు పాల్గొన్నారు. మోదీ సర్కారు, ఎన్నికల కమిషన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


