జమ్ముకశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన రక్తపాతం ఘటనకు నేటితో ఏడాది పూర్తైంది.
గత ఏడాది ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన దారుణ దాడిలో 26 మంది నిరపరాధులు ప్రాణాలు కోల్పోయారు. ఆ విషాద సంఘటనకు సంబంధించిన జ్ఞాపకాలు ఇప్పటికీ పహల్గాం వీధుల్లో మాయంకాకుండా గాయాల్లా మిగిలి ఉన్నాయి. ఆ దాడి అనంతరం ప్రభుత్వం దాదాపు 45 పర్యాటక ప్రదేశాలను మూసివేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు పహల్గాం స్మారక స్థలం వద్ద బాధిత కుటుంబాలు చేరుకొని నివాళులు అర్పించాయి. మరోవైపు, ఉగ్రవాదులు మళ్ళీ దాడులకు తెగబడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో లోయలో హైఅలర్ట్ ప్రకటించారు. ప్రత్యేక దళాలు అణువణువూ గాలిస్తూ, సానుభూతిపరుల ఇళ్లలో శోధనలు నిర్వహిస్తున్నాయి.
దాల్ సరస్సు పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. భయం నీడలు ఉన్నప్పటికీ, వేసవి వేడి నుంచి ఉపశమనం కోసం పర్యాటకులు దాల్ సరస్సు వద్దకు చేరుకుంటూనే ఉన్నారు.
పహల్గాం దాడికి ఏడాది పూర్తైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధితులను స్మరించుకున్నారు. వారిని ఎప్పటికీ మరచిపోలేమని స్పష్టం చేశారు. ఏ రూపంలోనైనా ఉగ్రవాదానికి భారతదేశం తలవంచదని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదుల దుష్ట యత్నాలు ఎప్పటికీ ఫలించవని హెచ్చరించారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు ఆయన హృదయపూర్వక సానుభూతి తెలియజేశారు.
సామాజిక మాధ్యమ వేదికలో చేసిన ప్రకటనలో, గత సంవత్సరం ఇదే రోజున జరిగిన ఆ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులను గుర్తు చేసుకుంటున్నానని తెలిపారు.వారి జ్ఞాపకం ఎప్పటికీ నిలిచిపోతుందని పేర్కొన్నారు. దేశంగా మనం దుఃఖంలోనూ, సంకల్పంలోనూ ఏకమై ఉన్నామని, ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.


