తైవాన్ స్వాతంత్య్రం కోసం మేం పోరాడబోమన్న అమెరికా అధ్యక్షుడు
వాషింగ్టన్: చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హెచ్చరికలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలొగ్గారు. తైవాన్ ఎన్నటికైనా మాదే. దాని గురించి తలదూరిస్తే మంచిది కాదు. ఘర్షణ, యుద్ధం వరకు దారితీస్తుందని చైనా పర్యటనలో ట్రంప్కు జిన్పింగ్ హెచ్చరించారు. దీనితో దిగివచ్చిన ట్రంప్…తైవాన్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అది తమకు కష్టమైన సమస్యేనని వెల్లడించారు. భౌగోళికంగా ఆ ప్రాంతం తమకు చాలా దూరంలో ఉందని వ్యాఖ్యానించారు. ‘తైవాన్ అంశం క్లిష్టమైన సమస్యే. ఈ ద్వీపం చైనాకు కేవలం 95 కిలోమీటర్ల దూరంలో ఉండగా, అమెరికాకు మాత్రం 15 వేల కి.మీ.కు పైగా దూరంలో ఉంది. సుదూర ప్రాంతం కారణంగా మేం వేగంగా స్పందించడం కష్టమే. చైనా చాలా శక్తిమంతమైన, పెద్ద దేశం కూడా. ఉద్రిక్తతల విషయంలో చైనా, తైవాన్లు సంయమనం పాటించాలి’ అని ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ ట్రంప్ చెప్పారు. వారి స్వాతంత్య్ర ఆకాంక్షల కోసం అంతదూరం ప్రయాణించి మేం యుద్ధం చేయాలని అనుకోవడం లేదన్నారు. చైనా పర్యటన అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తైవాన్ను తనలో పూర్తిగా విలీనం చేసుకోవాలని చైనా కోరుకుంటోంది. తైవాన్ స్వాతంత్య్రాన్ని అమెరికా బహిరంగంగా వ్యతిరేకించాలన్నది చైనా వాదన. ‘తైవాన్ విషయంలో చైనా ఏకపక్ష చర్యలకు దిగరాదు’ అని ఇంతకాలం అమెరికా స్పష్టంచేస్తూ వచ్చింది. దానికి భిన్నంగా ఇప్ప్పుడు ట్రంప్ మాట్లాడుతున్నారు. తైవాన్కు ఆయుధాలు విక్రయించాలా, వద్దా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పడమూ ఆయన వైఖరిలో మార్పును వెల్లడిస్తోంది. మరోసారి ట్రంప్ ఆలోచనల డొల్ల తనం బయటపడినట్లైంది.
జిన్పింగ్ హెచ్చరిక…దిగివచ్చిన ట్రంప్!
- Advertisement -
RELATED ARTICLES


