కోర్టు విధులు బహిష్కరణ.... రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు…స్టైఫండ్ రూ.11వేలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్
విశాలాంధ్రవిజయవాడ: జూనియర్ న్యాయవాదులకు ఇవ్వవలసిన న్యాయమిత్ర స్టైఫండ్ రూ 10వేలు తక్షణమే విడుదల చేయాలని, ఏపీ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లు శుక్రవారం కోర్టు విధులను బహిష్కరిస్తూ పెద్దఎత్తున నిరసన చేపట్టారు.
ఈ కార్యక్రమంలో బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బిబిఏ ప్రాంగణం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి ప్రభుత్వం పై డిమాండ్లను వెంటనే అమలు చేయాలని కోరుతూ అధికారులకు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.కె. బాష మాట్లాడుతూ రాష్ట్ర న్యాయవాద సంఘం పిలుపు మేరకు కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజున, తొలిసారిగా న్యాయవాదులు ఏకతాటిపై నిలబడి విధులను బహిష్కరించడం ద్వారా న్యాయవాద ఉద్యమంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైందని పేర్కొన్నారు.
కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు గత ప్రభుత్వం పెట్టిన పెండిరగ్, ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించిన రూ 10వేలు స్టైఫండ్తో పాటు గత ప్రభుత్వ బకాయిలను కూడా కలిపి తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. యువగళం పాదయాత్రలో లోకేష్ న్యాయవాదులపై జరుగుతున్న అక్రమ దాడుల నుండి రక్షణ కోసం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ చలసాని అజయ్ కుమార్, సీనియర్ న్యాయవాది, బీజేపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీనివాస రాజు, మాజీ సెక్రటరీ రాజా, బెజవాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పిల్లా శ్రీనివాస్, లైబ్రేరియన్ త్రినాథ్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.


