2026 నైరుతి రుతుపవనాలపై ఐఎండీ కీలక అంచనా
ఈ ఏడాది దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన తాజా నివేదికలో వెల్లడించింది. 2026 రుతుపవనాలకు సంబంధించి విడుదల చేసిన దీర్ఘకాలిక అంచనాల ప్రకారం, జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వర్షపాతం దీర్ఘకాల సగటు (ఎల్పీఏ)లో కేవలం 90 శాతానికి పరిమితం కావొచ్చని తెలిపింది. ఈ అంచనాల్లో 4 శాతం అటూఇటూగా మార్పులు ఉండొచ్చని పేర్కొంది. దీంతో ఈసారి వర్షపాతం సాధారణం కంటే తక్కువ కేటగిరీలోకి వస్తుందని, ఇది వ్యవసాయ రంగం, జలవనరులు, దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ అంచనాలకు ప్రధాన కారణంగా పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్ నినో పరిస్థితులను ఐఎండీ పేర్కొంది. ఎల్ నినో సాధారణంగా రుతుపవన వ్యవస్థను బలహీనపరుస్తుంది. మరోవైపు, రుతుపవనాలకు మేలు చేసే ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐఓడీ) ప్రస్తుతం తటస్థంగా ఉందని, రుతుపవన కాలంలో కూడా అలాగే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో, ఈ సీజన్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యేందుకు 84 శాతం అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ఇటీవలి సంవత్సరాలలో ఇది అత్యంత బలహీనమైన రుతుపవన సీజన్లలో ఒకటిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది.
ప్రాంతాల వారీగా చూస్తే.. దేశంలోని అధిక వర్షాధార వ్యవసాయ ప్రాంతాలు ఉండే ఃమాన్సూన్ కోర్ జోన్ఃలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని అంచనా వేశారు. ఈశాన్య భారతంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండగా, వాయువ్య, మధ్య, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో లోటు వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ తెలిపింది. అయితే, వాయువ్య, ఈశాన్య, తూర్పు భారతంలోని కొన్ని ప్రాంతాలతో పాటు దక్షిణ ద్వీపకల్పంలోని తూర్పు భాగాలలో అక్కడక్కడా సాధారణం నుంచి అధిక వర్షపాతం కురవవచ్చని పేర్కొంది.
ఇక, జూన్ నెలకు సంబంధించి దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ హెచ్చరించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్ వంటి పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ వడగాడ్పులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నీటి యాజమాన్య పద్ధతులు, కరవును తట్టుకునే విత్తనాల ఎంపిక వంటి ప్రత్యామ్నాయ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని సలహా ఇచ్చింది. జులై నెలకు సంబంధించిన పూర్తిస్థాయి అంచనాలను జూన్ చివరి వారంలో విడుదల చేయనున్నట్లు ఐఎండీ వెల్లడించింది.


