72వ రోజుకు చేరిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన 72వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ మంత్రి లోకేశ్ ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలను ఓపికగా విని, వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలను వివరిస్తూ ప్రజలు, కార్యకర్తలు అందించిన వినతిపత్రాలను ఆయన స్వీకరించారు. కొన్ని కీలకమైన సమస్యలపై లోకేశ్ అక్కడికక్కడే స్పందించి, వాటి పరిష్కారం కోసం తన సిబ్బందికి, సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను వీలైనంత వేగంగా పరిష్కరించి, వారికి అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అందిన ప్రతి విజ్ఞప్తిని పరిశీలించి, న్యాయమైన పరిష్కారం అందిస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. మంత్రి నుంచి హామీ లభించడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు.


