దేశవ్యాప్తంగా ఈ నెల 3న నిర్వహించిన నీట్ (NEET) 2026 పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. రాజస్థాన్లో పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని NTA తెలిపింది.
జాతీయ అర్హత పరీక్ష (నీట్ యూజీ-2026)కు సంబంధించిన ప్రశ్నాపత్రం రాజస్థాన్లో లీకైనట్లు వచ్చిన వార్తలు పెనుదుమారం రేపాయి. ఈ నేపథ్యంలో జాతీయ పరీక్ష సంస్థ (NTA) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మే 3న జరిగిన నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను వెల్లడిస్తామని తెలిపింది. విద్యార్థుల ప్రయోజనాలు, జాతీయ పరీక్షా వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. కొత్త పరీక్ష కోసం విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, పరీక్ష ఫీజు చెల్లించనక్కర్లేదని తెలిపింది. పరీక్ష తేదీలను నిర్ణయించిన తర్వాత మళ్లీ అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామని పేర్కొంది. ఇక, ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్టీఏ తెలిపింది.
ఈనెల 3న జరిగిన నీట్ పరీక్షలో కెమిస్ట్రీ విభాగంలో వచ్చిన సుమారు 120కి పైగా ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీసు పేపరును గుర్తించినట్లు రాజస్థాన్ అదనపు డీజీపీ విశాల్ బన్సాల్ వెల్లడించారు. ఈ మెటీరియల్ రాజస్థాన్లోని సికార్లో పరీక్షకు 42 గంటల ముందు వాట్సాప్లో అందుబాటులోకి వచ్చినట్లు గుర్తించారు. ఇందులోని సమాచారం.. నీట్ ప్రశ్నాపత్రంలోని 600 మార్కుల ప్రశ్నలతో పోలి ఉండటం గమనార్హం. కొన్ని ప్రశ్నల్లోని జవాబుల క్రమం కూడా అచ్చం ఒకేలా ఉండడం పలు అనుమానాలకు తావిచ్చింది.
ఆ ప్రాక్టీసు పేపరు కేరళలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థికి చెందినదిగా దర్యాప్తులో వెల్లడైంది. ఆ వ్యక్తి ఈనెల 1న సికార్లోని తన స్నేహితుడికి ఈ మెటీరియల్ ఇచ్చాడని.. ఆ తర్వాత అది పీజీ వసతిగృహాలు, కోచింగ్ నెట్వర్క్లు, కెరీర్ కౌన్సిలర్లు, పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు చేరిందని అధికారులు తెలిపారు. ఆ మెటీరియల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన 300కు పైగా చేతిరాత ప్రశ్నలు ఉన్నాయని వెల్లడించారు. దీనిని విద్యార్థులకు రూ.20వేల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయించారని, కొందరు అభ్యర్థుల నుంచి ముందుగానే రూ.30 వేలకు పైగా వసూలుచేశారని గుర్తించామని రాజస్థాన్ పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పలువురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు.


