ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ యాప్కు గ్రీన్సిగ్నల్
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పనితీరుపై మరింత పర్యవేక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఉద్యోగుల హాజరు నమోదుకు ఫేస్ రికగ్నిషన్ ఆధారిత మొబైల్ యాప్ను తప్పనిసరిగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది.ఇకపై ఈ యాప్ ద్వారానే అటెండెన్స్ నమోదు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.కార్యాలయ సమయాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం, ఆలస్యంగా హాజరు కావడం లేదా గైర్హాజరు వంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.అయితే ప్రస్తుతం రీ-సర్వే కార్యక్రమాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఈ అటెండెన్స్ యాప్ నుంచి తాత్కాలిక మినహాయింపు ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
జవాబుదారీతనాన్ని పెంచడమే లక్ష్యం
ఫీల్డ్లో పనిచేస్తున్న వారి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు.ఇటీవల కొంతమంది గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు కార్యాలయాల్లో అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదులు అధికారుల దృష్టికి వచ్చాయి.దీంతో ప్రజలకు సక్రమంగా సేవలు అందకపోవడం, కార్యాలయాల్లో ఉద్యోగులు కనిపించకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయన్న అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది.ప్రజలకు నేరుగా సేవలు అందించే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడం, జవాబుదారీతనాన్ని పెంచడం లక్ష్యంగా ఫేస్ రికగ్నిషన్ ఆధారిత అటెండెన్స్ యాప్ను ప్రవేశపెడుతున్నట్లు అధికారులు తెలిపారు.ఈకొత్త విధానం అమలుతో గ్రామ, వార్డు సచివాలయాల్లో సేవలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అందనున్నాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.


