పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా సాగిన ఉగ్రదాడి ఘటన వెనుక పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతోపాటు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉన్నాయని తమ ప్రాధమిక దర్యాప్తులో స్పష్టమైందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వెల్లడించింది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఆదేశాల మేరకే ఈ దాడిని లష్కరే తోయిబా అమలు చేసిందని తెలిపింది. ఈ దాడికి సంబంధించిన పథక రచన అంతా పాకిస్థాన్లోనే జరిగిందని పేర్కొంది. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో హష్మీ ముసా అలియాస్ సులేమన్, అలీ బాయ్లు పాకిస్థాన్ జాతీయులను ఎన్ఐఏ తేల్చి చెప్పింది. ఈ ఉగ్రదాడిపై తాము పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు.
పహల్గాం ఘటన జరిగిన సమయంలో ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్థాన్లోని ఉగ్రవాదులతో నిరంతర సంభాషణలు కొనసాగించారని తెలిపింది. అలాగే ఈ ఉగ్రదాడి ఎక్కడ చేయాలని.. ఏ సమయంలో చేయాలి తదితర అంశాలన్ని పాక్లోని ఉగ్రవాదులు ఆదేశాలకు అనుగుణంగానే సాగిందని ఎన్ఐఏ వివరించింది. ఈ దాడి జరగడానికి వారం రోజుల ముందు ఈ ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించారని స్పష్టం చేసింది. అలాగే వారికి ఆశ్రయం కల్పించడంతోపాటు ఆయుధాలు సరఫరా చేయడం తదితర విషయాల్లో స్థానికులు సహాయ సహాకారాలు అందించారని జాతీయ దర్యాప్తు సంస్థ సోదాహరణగా వివరించింది.
ఆధారాల సేకరణ..
ఈ దర్యాప్తుపై ఎన్ఐఏ.. ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్ డేటా ద్వారా పలు విషయాలను సేకరించింది. అలాగే ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ప్రదేశం నుంచి దాదాపు 40 క్యాటరిడ్జులు స్వాధీనం చేశారు.అనంతరం వాటిని బాలిస్టిక్, కెమికల్ అనాలసిస్కు పంపారు. ఇక దాడి జరిగిన ప్రదేశంలో 3డీ మ్యాపింగ్ను సైతం ఎన్ఐఏ అధికారులు నిర్వహించారు. అందులోభాగంగా వ్యాలీ మొబైల్ డేటా నుంచి కీలక అంశాలను రాబట్టారు. అలాగే బైసరన్ ప్రాంతంలో మూడు శాటిలైట్ ఫోన్లు పని చేశాయని.. అందులో రెండు ఫోన్ల సిగ్నల్స్ ట్రేస్ చేసినట్లు ఎన్ఐఏ తన నివేదికలో వివరించింది.
వేలాది మందిని విచారించిన ఎన్ఐఏ..
ఈ ఘటనపై 2800 మందిని ఎన్ఐఏ ప్రశ్నించింది. అలాగే 150 మంది వ్యక్తులను కస్టడీలోకి తీసుకుని విచారించింది. అలాగే కుప్వారా, పుల్వామా, సోపుర్, అనంతనాగ్, బారాముల్లాలో సోదాలు నిర్వహించింది. అలాగే సరిహద్దు ప్రాంతంలోని పలువురు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది.